ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై చంద్రబాబు విచారం
- పరవాడలోని పార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం
- సజీవ దహనమైన ఇద్దరు కార్మికులు
- మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో అత్యంత విషాదకరమైన మరో ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఈ ఉదయం ఒక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
పరవాడ ఫార్మా సిటీలోని 'దక్షిణ్ ఎనర్జీ' పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించి, దట్టమైన పొగతో పాటు మంటలు వ్యాపించాయి. ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీసినప్పటికీ.. ఇద్దరు కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు తక్షణమే స్పందించారు. ఫార్మా సిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు, పరవాడ కేంద్రం నుంచి మరొక ఫైర్ ఇంజన్ను స్పాట్కు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన బాధితులను వెంటనే సమీపంలోని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలపై సమగ్ర సాంకేతిక విచారణ జరపాలని చెప్పారు.