అన్నా హజారే అల్టిమేటం.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష
- జులై 5 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే హెచ్చరిక
- మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
- ఫీజుల పెంపు, ఐడీ ప్రూఫ్ తప్పనిసరి చేయడంపై అభ్యంతరం
- ‘ఒక దరఖాస్తు-ఒక అంశం’ నిబంధనను వ్యతిరేకించిన హజారే
- కొత్త నిబంధనలు పారదర్శకతను దెబ్బతీస్తాయని ఆరోపణ
ఈ మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాసిన హజారే.. జూన్ 12న తీసుకొచ్చిన మహారాష్ట్ర ఆర్టీఐ రూల్స్–2026, సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. కొత్త నిబంధనల వల్ల ఆర్టీఐ చట్టం లక్ష్యం నీరుగారి, ప్రజలకు సమాచారం అందడం మరింత కష్టమవుతుందని విమర్శించారు.
ఆర్టీఐ దరఖాస్తుల ఫీజులను పెంచడాన్నీ హజారే తీవ్రంగా వ్యతిరేకించారు. 20 ఏళ్ల తర్వాత ఫీజులు పెంచితే, సమాచారం ఇవ్వకుండా ఆలస్యం చేసే అధికారులపై విధించే జరిమానాలను కూడా పెంచాలని సూచించారు. దరఖాస్తుదారులు గుర్తింపు పత్రాలు సమర్పించాల్సిన నిబంధన కూడా చట్టానికి విరుద్ధమని అన్నారు. ఇది సమాచారాన్ని కోరేవారి భద్రతకు ముప్పుగా మారుతుందని చెప్పారు.
‘ఒక దరఖాస్తులో ఒకే అంశం’ అనే నిబంధన అనవసర భారమని, ఒకే అంశంపై మళ్లీ దరఖాస్తు చేస్తే దాన్ని తిరస్కరించే అవకాశం కల్పించడం వల్ల పూర్తి సమాచారం పొందే హక్కు దెబ్బతింటుందని హజారే అభిప్రాయపడ్డారు. ప్రజలకు స్వయంగా సమాచారం అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యాలను సరిచేయకుండా, భారం మొత్తం ప్రజలపైనే మోపుతున్నారని విమర్శించారు.
ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఈ సవరణలను అమలు చేశారని ఆరోపించిన హజారే.. ప్రభుత్వం వెంటనే వాటిని ఉపసంహరించుకోకపోతే ప్రాణాలు పోయినా జులై 5 నుంచి దీక్ష ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.