అమెరికా పౌరసత్వం ఇక మరింత ప్రియం.. భారీగా పెరగనున్న ఫీజులు!

  • 75 శాతం వరకు పెంచాలని ప్రభుత్వ ప్రతిపాదన
  • తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన
  • పెరిగిన ప్రాసెసింగ్ ఖర్చుల వల్లే పెంపు అంటున్న హోంల్యాండ్ సెక్యూరిటీ
  • ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉన్న ముసాయిదా
అమెరికాలో స్థిరపడి, ఆ దేశ పౌరసత్వం పొందాలని ఆశిస్తున్న వారికి ఇది కొంత నిరాశ కలిగించే వార్త. పౌరసత్వ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదన అమలైతే, యూఎస్ సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఎంతో ఖరీదైనదిగా మారనుంది. ఈ కొత్త నిబంధనను నిన్న‌ ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ కోసం విడుదల చేశారు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్‌) ఈ కొత్త ముసాయిదా నిబంధనను రూపొందించింది. దీని ప్రకారం పౌరసత్వ దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అయ్యే పూర్తి ఖర్చులను రాబట్టుకోవడమే లక్ష్యంగా ఫీజులను పెంచుతున్నట్లు పేర్కొంది. ఇటీవల ప్రవేశపెట్టిన కఠినమైన స్క్రీనింగ్, భద్రతా తనిఖీలకు అయ్యే అదనపు వ్యయాన్ని కూడా ఈ ఫీజుల ద్వారా భర్తీ చేయాలని భావిస్తోంది.

ఎంత పెరగనుంది?
ప్రస్తుతం పేపర్ ఫైలింగ్ ద్వారా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి 760 డాలర్లు (సుమారు రూ. 71,940) ఫీజుగా ఉంది. తాజా ప్రతిపాదన ప్రకారం దీనిని 1,330 డాలర్లకు (సుమారు రూ. 1,25,895) పెంచనున్నారు. అంటే.. ఫీజులో ఏకంగా 570 డాలర్ల పెరుగుదల, అంటే సుమారు 75 శాతం భారం పడనుంది. ఇదే కాకుండా దరఖాస్తు తిరస్కరణకు గురైతే అప్పీల్ బోర్డు ముందు పునఃపరిశీలన కోసం వేసే అభ్యర్థన ఫీజును కూడా 830 డాలర్ల (సుమారు రూ. 78,566) నుంచి 1,475 డాలర్ల (సుమారు రూ. 1,39,620)కు పెంచనున్నారు. ఇది దాదాపు 77.7 శాతం పెరుగుదల.

ప్రభుత్వ వాదన.. విమర్శకుల ఆందోళన
ఈ ఫీజుల పెంపును డీహెచ్‌ఎస్ సమర్థించుకుంటోంది. న్యూస్‌వీక్ కథనం ప్రకారం, ప్రస్తుత ఫీజులు దరఖాస్తుల ప్రాసెసింగ్‌కు అవుతున్న వాస్తవ ఖర్చులను భరించలేకపోతున్నాయని ఓ డీహెచ్‌ఎస్ అధికారి తెలిపారు. ఒక వలసదారునికి లభించే అత్యంత ముఖ్యమైన ప్రయోజనం పౌరసత్వమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చట్టబద్ధంగా నివసిస్తున్న లక్షలాది మంది శాశ్వత నివాసితులపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వారికి పౌరసత్వం అందని ద్రాక్షగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

హోంల్యాండ్ సెక్యూరిటీ మాజీ అధికారి ఆడమ్ క్లెయిన్ న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ.. "పౌరసత్వాన్ని ప్రోత్సహించడం అనేది అమెరికా ప్రభుత్వ విధానంగా ఉండేది. ఎందుకంటే పౌరులుగా మారిన వారు ఆర్థికంగా వేగంగా ఎదుగుతారు, పౌర భాగస్వామ్యంలో చురుగ్గా పాల్గొంటారు. ఫీజుల పెంపు ఈ లక్ష్యాలకు గండి కొట్టే ప్రమాదం ఉంది" అని హెచ్చరించారు.

ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉంది. కనీసం 60 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

US Citizenship
Application Fee Hike
Department of Homeland Security
US Immigration News
Naturalization Cost
US Visa Fees

More Telugu News