ఇరాన్‌లో ఇజ్రాయెల్ ముఠా గుట్టురట్టు.. 3,292 మంది అరెస్ట్‌

  • ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం, దేశ వ్యతిరేక ప్రచారాల ఆరోపణలు
  • అరెస్ట్ అయిన వారిలో ఇజ్రాయెల్ కోసం నేరుగా ఆపరేషన్లు
  • ఇప్పటికే 1,061 మందిపై దోషారోపణ పత్రాల జారీ
  • వందలాది మంది అనుమానితుల ఆస్తుల జప్తు
  • అక్రమ నిర్బంధాలు జరుగుతున్నాయంటూ ‘అమ్నెస్టీ’ ఆందోళన
ఇజ్రాయెల్, అమెరికాతో సైనిక ఘర్షణలు ముగిసి ఇప్పుడిప్పుడే కాల్పుల విరమణ ఒప్పందాల దిశగా అడుగులు పడుతున్న తరుణంలో.. ఇరాన్‌లో కల్లోలం రేగింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థల కోసం గూఢచర్యం చేయడం, ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం సాగించడం వంటి దేశద్రోహ ఆరోపణలపై దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3,292 మంది పౌరులను ఇరాన్ భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. 

ఈ విషయాన్ని ఇరాన్ న్యాయవ్యవస్థ అధికార ప్రతినిధి అస్గర్ జహంగీర్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. దేశ అంతర్గత భద్రతను కాపాడటానికి, శత్రుదేశాల నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించడానికి ఈ ఆపరేషన్ అత్యంత కీలకమని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.

అరెస్ట్ అయిన వారిలో 684 మంది ఇజ్రాయెల్ కోసం క్షేత్రస్థాయిలో నేరుగా 'ఆపరేషనల్ యాక్షన్స్' నిర్వహించారని, మరో 1,258 మంది దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని న్యాయవ్యవస్థ వెల్లడించింది. వీరిలో 1,061 మందిపై  ఇప్పటికే అధికారికంగా దోషారోపణలు మోపినట్లు, దేశద్రోహులుగా తేలిన వందలాది మంది అనుమానితుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇస్ఫహాన్ వంటి ప్రావిన్సులలో ఆస్తుల జప్తు చర్యలు వేగంగా సాగుతున్నాయి.

మరోవైపు ఇరాన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన చర్యలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, నార్వే కేంద్రంగా పనిచేసే 'ఇరాన్ హ్యూమన్ రైట్స్' వంటి సంస్థలు ఈ అరెస్టులను తీవ్రంగా తప్పుబడుతున్నాయి. 

యుద్ధకాల భద్రతా నిబంధనల సాకుతో సామాన్య ప్రజలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని, బలవంతంగా ఒప్పిస్తున్నారని, పారదర్శకత లేని విచారణల ద్వారా రాజకీయ ప్రేరేపిత ఉరిశిక్షలు అమలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత అభియోగాలతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 40 మంది నిరసనకారులను ఉరి తీసినట్టు పేర్కొన్నాయి. ఇరాన్‌లో సమాచార వ్యవస్థపై కఠిన ఆంక్షలు ఉండటంతో విడివిడి కేసుల పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ, తమ కుటుంబ సభ్యులు అదృశ్యమవడంతో చాలామంది తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

More Telugu News