కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో 41 మంది సేఫ్

  • కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా దగ్ధమైన ఎలక్ట్రిక్ బస్సు
  • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అంచనా
  • డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 41 మంది ప్రయాణికులు
  • నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా కాలిపోయిన బస్సు
కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో 41 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఇవాళ‌ ఉదయం 41 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సు అలుగునూరు దాటి కాకతీయ కాలువ సమీపానికి చేరుకోగానే ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన డ్రైవర్ ప్రశాంత్, బస్సును రోడ్డు పక్కన ఆపివేశారు.

క్షణాల్లోనే ఆయన బస్సు డోర్‌తో పాటు ఎమర్జెన్సీ ద్వారాన్ని కూడా తెరిచి ప్రయాణికులందరినీ కిందకు దింపేశారు. ప్రయాణికులు కిందకు దిగిన నిమిషాల వ్యవధిలోనే బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తత వల్లే పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. 

TSRTC Electric Bus
Karimnagar bus fire
Karimnagar to Hyderabad bus
Driver Prashanth
Electric bus fire accident
Telangana RTC

More Telugu News