ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. విద్యార్థులకు మంత్రి లోకేశ్‌ శుభాకాంక్షలు

  • అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు
  • వాట్సాప్‌ మనమిత్ర ద్వారానూ అందుబాటులోకి
  • ఇంప్రూవ్ మెంట్‌ పరీక్షలతో 1.83 లక్షల మందికి లబ్ధి
  • ఫెయిల్ అయిన దాదాపు లక్ష మంది విద్యార్థులు ఉత్తీర్ణత
  • విద్యార్థుల పట్టుదల, కృషిని అభినందించిన నారా లోకేశ్‌
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ (ఐపీఏఎస్‌ఈ)-2026 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ మనమిత్ర సేవ ద్వారా కూడా తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్ మెంట్‌ పరీక్షల ద్వారా తమ ఫలితాలను మెరుగుపరుచుకున్న వారిని అభినందించారు. వారి పట్టుదల, కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

మొదటి సంవత్సరం ఫలితాల్లో 2,29,034 మంది విద్యార్థుల్లో 1,35,435 మంది (59 శాతం) తమ స్కోర్‌ను మెరుగుపరుచుకున్నారు. అలాగే 1,09,003 మంది అభ్యర్థుల్లో 42,379 మంది (39 శాతం) ఉత్తీర్ణత సాధించి ఫలితాలను మెరుగుపరుచుకున్నారు. రెండో సంవత్సరం ఫలితాల్లో 91,303 మంది విద్యార్థుల్లో 48,149 మంది (53 శాతం) మెరుగైన ఫలితాలు సాధించారు. మరోవైపు 1,02,018 మంది అభ్యర్థుల్లో 57,327 మంది (56 శాతం) ఉత్తీర్ణత సాధించి తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారు.

ప్రభుత్వం కల్పించిన అవకాశంతో మొత్తం 1.83 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ మార్కులను పెంచుకోగలిగారు. అలాగే సాధారణ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన దాదాపు లక్ష మంది విద్యార్థులకు మరో అవకాశం లభించడంతో వారు ఉన్నత విద్య వైపు అడుగులు వేయడానికి మార్గం సుగమమైంది. విద్యార్థులంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నత విద్యను కొనసాగించి మరిన్ని విజయాలు సాధించాలని లోకేశ్‌ ఆకాంక్షించారు.

Nara Lokesh
AP Inter Supplementary Results 2026
IPA SE Results
Andhra Pradesh Intermediate Results
BIEAP Results
Mana Mithra WhatsApp Service

More Telugu News