వెజ్ క్యాంటీన్లో కోడిగుడ్లు.. అహ్మదాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో వివాదం
- అహ్మదాబాద్ ఇంజినీరింగ్ కాలేజీలో కోడిగుడ్ల వివాదం
- శాకాహార క్యాంటీన్లో ఆమ్లెట్లు అమ్ముతున్నారని విద్యార్థుల ఫిర్యాదు
- క్యాంటీన్ ఆపరేటర్కు నోటీసులు జారీ చేసిన యాజమాన్యం
- మరోసారి పునరావృతమైతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరిక
- ప్రస్తుతానికి కోడిగుడ్ల ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేత
క్యాంటీన్లో కోడిగుడ్ల విక్రయం తమ మతపరమైన, సాంస్కృతిక మరియు వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీస్తోందని విద్యార్థులు ఆరోపించారు. శాకాహార పదార్థాలకు, కోడిగుడ్లతో తయారు చేసే వంటకాలకు ఒకే రకమైన పాత్రలను ఉపయోగిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కళాశాల ప్రిన్సిపాల్తో పాటు గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జీటీయూ) వైస్ ఛాన్సలర్కు విద్యార్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అందిన ఫిర్యాదులపై విచారణ జరిపినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నిలయ్ భూప్తాని తెలిపారు. క్యాంటీన్ నిర్వాహకుడిని తీవ్రంగా హెచ్చరించామని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతమైతే కాంట్రాక్టును రద్దు చేస్తామని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. నెలన్నర క్రితం కూడా ఇలాంటి ఫిర్యాదులు రావడంతో అప్పట్లో ఒకసారి నోటీసు జారీ చేశామని వెల్లడించారు. క్యాంటీన్లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు అధ్యాపకులతో ఆకస్మిక తనిఖీలు (స్పాట్ చెక్స్) నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
ప్రస్తుతానికి క్యాంటీన్లో కోడిగుడ్లకు సంబంధించిన ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశారు. సుమారు 7,000 మంది విద్యార్థులు ఉన్న ఈ విద్యాసంస్థ క్యాంటీన్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై కూడా పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.