భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే అవుట్!

  • భద్రతా అనుమతులు రద్దు చేయడంతో భారత్‌లో టర్కీ ఏవియేషన్ సంస్థకు భారీ నష్టం
  • సుమారు 400 నుంచి 500 మిలియన్ డాలర్ల వ్యాపారం కోల్పోయినట్టు వెల్లడి
  • ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాక్‌కు టర్కీ మద్దతే ఇందుకు కారణం
  • జాతీయ భద్రత దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
  • టర్కీ సంస్థకు చెందిన 10,000 మంది ఉద్యోగులు ఇతర కంపెనీలకు బదిలీ
భారతదేశంలోనే అతిపెద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్ (విమానాశ్రయ సేవల) సంస్థగా పేరొందిన టర్కీకి చెందిన 'సెలెబీ ఏవియేషన్' (Celebi Aviation) భారత్ నుంచి వెళ్లిపోయిన ఏడాది తర్వాత తమకు జరిగిన భారీ నష్టాన్ని బహిరంగంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం తమకు రక్షణ అనుమతులను (Security Clearances) రద్దు చేయడం వల్ల దాదాపు రెండు దశాబ్దాల కష్టం బూడిదలో పోసిన పన్నీరైందని, సుమారు 400 నుంచి 500 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4,200 కోట్లు) వ్యాపార విలువను కోల్పోయామని సెలెబీ చైర్‌పర్సన్ జానన్ సెలెబియోగ్లు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా 9 ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) 2025 మే 15న నిషేధం విధించింది.

ఈ కఠిన నిర్ణయానికి భారత్-టర్కీ దేశాల మధ్య ముదిరిన అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే ప్రధాన కారణం. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు మరణించగా.. దానికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరిట సైనిక చర్య చేపట్టింది. ఆ సమయంలో టర్కీ ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు డ్రోన్లు, సైనిక సాయాన్ని అందించడంపై భారత్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. టర్కీ ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న కంపెనీలు భారత విమానాశ్రయాల్లో కొనసాగడం జాతీయ భద్రతకు ముప్పని భావించిన కేంద్ర ప్రభుత్వం.. సెలెబీ సంస్థ అనుమతులను రద్దు చేస్తూ తక్షణ ఆదేశాలు జారీ చేసింది.

ఈ నిషేధం తర్వాత సెలెబీ సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన పరికరాలను భారత అధికారులు సీజ్ చేయగా.. ఆ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 10,000 మంది (ఎక్కువగా భారతీయులు) ఉద్యోగులను వేరే దేశీయ విమానయాన సంస్థలకు బదిలీ చేశారు. తాము కేవలం ఒక సాధారణ కుటుంబ వ్యాపార సంస్థలమని, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో తమకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని సెలెబీ యాజమాన్యం వాదించింది. ఈ రద్దుపై వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ.. దేశ భద్రత కంటే ఏ వ్యాపార సంస్థ ప్రయోజనాలు ముఖ్యం కాదంటూ కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది.  

Celebi Aviation
India Turkey relations
Aviation security clearance
BCAS India
Operation Sindoor
Canan Celebioglu

More Telugu News