12 ఏళ్లుగా ల్యాబ్కే పరిమితమైన త్రిష సినిమా.. ఇప్పుడు విడుదలకు రెడీ!
- త్రిష, అరవింద్ స్వామి జంటగా 'శతురంగ వెట్టై-2'
- నిర్మాతల ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదల కాని వైనం
- ప్రస్తుతం తమిళనాడులో పీక్స్ కు చేరిన త్రిష క్రేజ్
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. హారర్, కామెడీ, క్రైమ్, లేడీ ఓరియంటెడ్.. ఇలా ఏ జోనర్ అయినా తన మార్క్ నటనతో మెప్పిస్తూ దశాబ్దాలుగా అగ్రశ్రేణి హీరోయిన్గా రాణిస్తోంది. అయితే, ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో జరిగిన కీలక మార్పులు, ముఖ్యంగా దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరుణంలో.. విజయ్తో త్రిష రిలేషన్ గురించిన రూమర్స్ సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఈ పొలిటికల్, పర్సనల్ బజ్ వల్ల తమిళనాడు మార్కెట్లో త్రిష క్రేజ్ ఒక్కసారిగా పీక్స్కు చేరింది.
ఇప్పుడు ఇదే క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు.. ఏకంగా 12 ఏళ్లుగా ల్యాబ్కే పరిమితమైన త్రిష పాత సినిమాను థియేటర్లలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్రిష, అరవింద్ స్వామి లీడ్ రోల్స్లో నిర్మల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘శతురంగ వెట్టై-2’. నిజానికి ఈ సినిమా షూటింగ్ 2014లోనే పూర్తయింది. కానీ ఆ సమయంలో నిర్మాతలకు ఎదురైన తీవ్ర ఆర్థిక సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ రిలీజ్ కాకుండా అటకెక్కింది.
ఇన్నేళ్లపాటు ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం తమిళనాడులో త్రిషకు ఉన్న విపరీతమైన క్రేజ్, పొలిటికల్ కనెక్టివిటీ నేపథ్యంలో.. ఈ క్రైమ్ థ్రిల్లర్ను థియేటర్లలోకి వదిలితే కచ్చితంగా భారీ కలెక్షన్స్ రాబట్టవచ్చని చిత్ర బృందం గట్టిగా అంచనా వేస్తోంది. అందుకే 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘శతురంగ వెట్టై-2’ను రిలీజ్ చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.