సేఫ్టీ రోప్ లేకుండానే 130 అడుగుల నుంచి తోసేశారు.. చూస్తుండగానే ప్రాణం పోయింది!

  • బ్రెజిల్‌లో రోప్ జంపింగ్ అడ్వెంచర్ విషాదాంతం
  • సేఫ్టీ రోప్ కట్టకుండానే యువతిని కిందకు తోసేసిన నిర్వాహకులు
  • 130 అడుగుల ఎత్తు నుంచి పడి 21 ఏళ్ల యువతి అక్కడికక్కడే మృతి
  • ఘటనపై ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ముగ్గురిపై హత్యా నేరం నమోదు
అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎంత థ్రిల్‌ను ఇస్తాయో, చిన్న పొరపాటు జరిగితే అంతే విషాదాన్ని మిగులుస్తాయని బ్రెజిల్‌లో జరిగిన ఓ ఘటన నిరూపించింది. సాహసం కోసం వెళ్లిన ఓ యువతి, నిర్వాహకుల ఘోర తప్పిదం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. సేఫ్టీ రోప్ కట్టకుండానే 21 ఏళ్ల యువతిని 130 అడుగుల ఎత్తైన వంతెన పైనుంచి కిందకు తోసేయడంతో ఆమె అక్కడికక్కడే చ‌నిపోయింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
సావో పాలో రాష్ట్రంలోని లైమీరా నగరంలో ఉన్న 'పొంటె డొ ఎస్కెలెటో' (స్కెలెటన్ బ్రిడ్జ్) వద్ద ఈ దారుణం జరిగింది. మృతురాలిని ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ అయిన మరియా ఎడుర్డా రోడ్రిగ్స్ డి ఫ్రీటాస్ (21)గా గుర్తించారు. ప్రైవేట్ ఆపరేటర్లు నిర్వహించిన రోప్-జంప్ ఈవెంట్‌లో ఆమె ఉత్సాహంగా పాల్గొంది. నిర్వాహకులు ఆమెను వంతెన అంచుకు తీసుకువచ్చి, కిందకు దూకేందుకు సిద్ధం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సిబ్బంది మరియాను కిందకు తోసేయడం ఈ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఆమెకు కట్టాల్సిన భద్రతా తాడు కిందనే చుట్టి ఉండటాన్ని గమనించిన అక్కడి వారు 'తాడు.. తాడు కట్టలేదు!' అంటూ గట్టిగా అరిచారు. కానీ, అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయింది. మరియా 130 అడుగుల (40 మీటర్లు) ఎత్తు నుంచి వేగంగా కిందపడి మృతి చెందింది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పారామెడికల్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కానీ, మరియా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం లీగల్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. కళ్ల ముందే జరిగిన ఈ విషాదాన్ని చూసి ఆమె కాబోయే భర్త అక్కడే అనారోగ్యానికి గురవడంతో అతడిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

మిలిటరీ, సివిల్ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, ఈవెంట్ నిర్వహణతో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురిపై ఉద్దేశపూర్వక హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటన జరిగిన ప్రదేశం ఎలాంటి నియంత్రణలు లేనిదని, ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ కోసం ఇక్కడకు తరచూ వస్తుంటారని తెలిసింది. ఈ ప్రాంతంలో భద్రతా చర్యలపై మరింత పర్యవేక్షణ, జవాబుదారీతనం అవసరమని లైమీరా మేయర్ మురిలో ఫ్లిక్స్ పేర్కొన్నారు.

విషాదం జరగడానికి కొద్దిసేపటి ముందు, మరియా తన ఉత్సాహాన్ని, కొద్దిపాటి ఆందోళనను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం మరింత కలచివేస్తోంది. బ్రెజిల్‌లోని అడ్వెంచర్ టూరిజం రంగంలో భద్రతా ప్రమాణాలపై ఈ ఘటన తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. 

Maria Eduarda Rodrigues de Freitas
Brazil rope jump accident
Skeleton Bridge Limeira tragedy
Adventure sports death Brazil
Bungee jumping negligence
Sao Paulo news

More Telugu News