స్టాక్‌ మార్కెట్లలో భారీ జోష్‌.. సెన్సెక్స్‌ 1,000 పాయింట్ల జంప్‌

  • 23,455 స్థాయిని తాకిన నిఫ్టీ
  • రియాల్టీ, ఆటో షేర్లలో కొనుగోళ్లు
  • ముడిచమురు ధరలు తగ్గడం ఊరట
  • ఆసియా, అమెరికా మార్కెట్లలో జోష్‌
  • ఇరాన్‌ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు
దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, ముడిచమురు ధరలు తగ్గడం, ఇరాన్‌పై దాడులను ట్రంప్‌ నిలిపివేశారన్న వార్తలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచాయి. దీంతో మార్కెట్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి.

ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 1,000 పాయింట్ల వరకు ఎగబాకింది. 1.35 శాతం లాభంతో 74,834 పాయింట్ల ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ కూడా దాదాపు 300 పాయింట్లు పెరిగి 23,455 స్థాయికి చేరుకుంది. మార్కెట్‌ ప్రారంభం నుంచే బలమైన కొనుగోళ్లు కనిపించాయి.

రంగాల వారీగా చూస్తే దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లోనే ట్రేడవుతున్నాయి. రియాల్టీ సూచీ 2.5 శాతానికి పైగా లాభపడి టాప్‌ గెయినర్‌గా దూసుకెళ్తోంది. ఆటో, ప్రైవేట్‌ బ్యాంకులు, పీఎస్‌యూ బ్యాంకులు కూడా మంచి లాభాలు నమోదు చేస్తున్నాయి. మీడియా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, సిమెంట్‌, కెమికల్స్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగాల షేర్లలో కూడా కొనుగోళ్లు కనిపించాయి.

మెటల్‌ షేర్లు కూడా లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ సూచీలు కూడా సానుకూలంగా కదిలాయి. మార్కెట్‌లో విస్తృత స్థాయిలో కొనుగోళ్లు కనిపించడం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా జోష్‌ కొనసాగుతోంది. జపాన్‌ నిక్కీ సూచీ 3 శాతానికి పైగా ఎగబాకగా, హాంకాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ 2 శాతం పెరిగింది. దక్షిణ కొరియా కోస్పీ సూచీ 8 శాతానికి పైగా లాభపడింది. అమెరికా మార్కెట్లు కూడా గురువారం భారీ లాభాలతో ముగిశాయి.

ముడిచమురు ధరలు తగ్గడం మార్కెట్లకు మరింత ఊరటనిచ్చింది. అమెరికా వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 85 డాలర్లకు పడిపోయింది. బ్రెంట్‌ క్రూడ్‌ ధర కూడా 88.94 డాలర్ల వద్దకు దిగివచ్చింది. చమురు ధరల తగ్గుదల భారత్‌ వంటి దిగుమతి దేశాలకు సానుకూల అంశంగా మారింది.

Stock Market
Sensex
Nifty 50
Indian Share Market
Crude Oil Prices
Global Market Cues

More Telugu News