'పెద్ది' టికెట్ ధరల పెంపు: తెలంగాణ హోం శాఖ కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ పిటిషన్

Peddi ticket price hike Contempt of court case against Telangana Home Secretary
  • హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌పై దాఖలైన పిటిషన్
  • ప్రభుత్వ మెమో ప్రాథమికంగా చట్టవిరుద్ధమని హైకోర్టు వ్యాఖ్య
  • తదుపరి విచారణను జూన్ 15వ తేదీకి వాయిదా వేసిన న్యాయస్థానం
రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన 'పెద్ది' చిత్ర టికెట్ ధరల పెంపు వివాదం తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ మెమో ప్రాథమికంగా చట్టవిరుద్ధంగా కనిపిస్తోందని న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

'పెద్ది' సినిమాకు 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ జూన్ 2న హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇది జీవో 121కు, గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని పేర్కొంటూ న్యాయవాది దాచేపల్లి చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపించారు.

వాదనలు విన్న న్యాయస్థానం, టికెట్ ధరల విషయంలో ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వానికి సూచించింది. హోంశాఖ నుంచి పూర్తి వివరాలు సేకరించడానికి సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.

భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తరచుగా వివాదాస్పదమవుతోంది. 'పెద్ది' సినిమా టికెట్ల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు పిటిషన్లు విచారణలో ఉన్న విషయం తెలిసిందే.
Go Back to Shorts
Peddi Movie
Ram Charan
Telangana High Court
Shikha Goel
Ticket Price Hike
Contempt of Court

More Telugu News