ఫ్యూచర్ సిటీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్న రేవంత్
- ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అన్న రేవంత్
- ఆధునిక భారతదేశానికి నూతన నగరంగా ఫ్యుచర్ సిటీ నిలవబోతోందని వ్యాఖ్య
- ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న సీఎం
తెలంగాణ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయి లిఖించబడబోతోంది. హైదరాబాద్ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ కల సాకారమయ్యేందుకు తొలి అడుగు పడింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ భవన ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.
ఈ చారిత్రాత్మక సందర్భంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. "ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. ఆధునిక భారతదేశానికి నూతన నగరంగా ఈ భారత్ ఫ్యూచర్ సిటీ నిలవబోతోంది" అని అత్యంత ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ అథారిటీ భవనాన్ని కేవలం 6 నెలల రికార్డు సమయంలోనే నిర్మించి పూర్తి చేయడం విశేషం. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో, 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రణాళిక, సాంకేతికత, సుస్థిర అభివృద్ధికి ఈ ఫ్యూచర్ సిటీ ఒక నిలువెత్తు ప్రతీకగా మారబోతోందని సీఎం వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్లోని మరో విశేషం ఏంటంటే.. ఈ భవనం ప్రారంభం కాకముందే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుండి ‘నెట్ జీరో’ (Net Zero) భవనంగా గుర్తింపు పొందింది. అంటే పర్యావరణానికి ఎలాంటి హాని చేయకుండా, సహజ వనరుల వినియోగంతో ఈ కార్యాలయాన్ని రూపొందించారు. ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో ఒకటిగా ఈ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సీఎం స్పష్టం చేశారు.