ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్‌పై రేవంత్ అబద్ధం చెబుతున్నారు: బీజేపీ

  • రాజ్యాంగ పదవిలో ఉండి రేవంత్ రెడ్డి అసత్యాలు చెబుతున్నారని బీజేపీ ఆరోపణ
  • మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్‌మెంట్ కోరారనడం అవాస్తవమని విమర్శ
  • ఫడ్నవీస్ కార్యాలయం నుంచి ఎలాంటి అపాయింట్‌మెంట్ కోరలేదని వెల్లడి
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర, దక్షిణ భారత రాజకీయాలు చేస్తోందని ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసేందుకు ప్రయత్నించానని రేవంత్ రెడ్డి చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఆయన విమర్శించారు.

హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడుతూ, ఫడ్నవీస్‌తో భేటీ కోసం రేవంత్ రెడ్డి ఎలాంటి అపాయింట్‌మెంట్ కోరలేదని, ఈ విషయాన్ని ఫడ్నవీస్ కార్యాలయమే స్పష్టం చేసిందని తెలిపారు. నెల రోజుల క్రితం ఒక మంత్రి (ఉత్తమ్) అపాయింట్‌మెంట్ కోరారని, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రే స్వయంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య విభజన రాజకీయాలకు పాల్పడుతోందని రాంచందర్ రావు విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ సాధిస్తున్న పురోగతిని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ నేతలు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు.

ఈ సందర్భంగా మూసీ నది ప్రక్షాళన, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే బాధితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ పోరు తీవ్రతరమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Revanth Reddy
Devendra Fadnavis
Ramachander Rao
BJP Telangana
Congress BJP political row

More Telugu News