విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. హాట్ మెటల్ పడి ఎనిమిది మంది సజీవ దహనం
- హాట్ మెటల్ ల్యాడిల్స్ కిందపడి సజీవదహనం
- స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో చోటుచేసుకున్న ఘటన
- పలువురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన
స్టీల్ మెల్టింగ్ స్టేషన్-2లో కన్వేయర్ ద్వారా హాట్ మెటల్ (మరుగుతున్న ఉక్కు ద్రవం) ఉన్న ల్యాడిల్స్ను తరలిస్తుండగా అవి ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఉక్కు ద్రవం... కింద పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, సమీపంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ప్లాంటు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ఊహించని దుర్ఘటనతో స్టీల్ ప్లాంటులో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.