సింగరేణిలో భారీ కుంభకోణం.. రూ.1,600 కోట్ల బొగ్గు మాయంపై న్యాయ విచారణకు కేటీఆర్ డిమాండ్

  • సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైనట్లు కేటీఆర్ ఆరోపణ
  • సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు డిమాండ్
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసి విచారణ కోరిన కేటీఆర్
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో సుమారు రూ. 1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) సంచలన ఆరోపణలు చేశారు. ఈ భారీ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి కేటీఆర్ ఒక లేఖ రాశారు.

సింగరేణిలోని పలు స్టాక్‌యార్డులలో బొగ్గు నిల్వల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. రికార్డుల ప్రకారం బొగ్గుపై సెస్, ఆదాయపు పన్ను చెల్లించినప్పటికీ, క్షేత్రస్థాయి తనిఖీల్లో నిల్వల మధ్య భారీ వ్యత్యాసం కనిపించిందని వివరించారు. ఈ వ్యవహారం వెనుక బొగ్గును అక్రమంగా తరలించి బహిరంగ మార్కెట్‌లో విక్రయించిన భారీ కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.

ఈ కుంభకోణం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ హస్తం ఉందని, లేదా బాధ్యులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ మంత్రులకు మధ్య లోపాయికారీ సంబంధాలు ఉన్నాయేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ స్కామ్‌ను బయటపెట్టకుండా ఉండేందుకే తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.                                

KTR
Singareni Coal Scam
SCCL
K T Rama Rao
Revanth Reddy
Kishan Reddy
Coal Corruption Case
Telangana Politics
BRS Party
Singareni Collieries Company Limited

More Telugu News