పుణే విప్రోలో మత వేధింపులు.. మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు

  • ఇస్లాంలోకి మారాలంటూ సీనియర్ అధికారిణి వేధించారని ఫిర్యాదు
  • బలవంతంగా తనతో రాజీనామా చేయించారని ఆరోపణ
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పుణే పోలీసులు
  • విచారణకు పూర్తిగా సహకరిస్తామన్న విప్రో యాజమాన్యం
ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో మతపరమైన వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పుణేలోని హింజేవాడి క్యాంపస్‌లో పనిచేసిన ఓ మాజీ మహిళా ఉద్యోగిని, తన సీనియర్ అధికారిణి ఒకరు తనను ఇస్లాం మతంలోకి మారాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేశారని, వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపుల కారణంగానే తాను 2025 ఆగస్టులో ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు.

బాధితురాలు పుణెలో హిందూ జనజాగృతి సమితి నిర్వహించిన మీడియా సమావేశంలో తన ఆవేదనను వెల్లడించారు. 2019 నుంచి 2025 వరకు విప్రోలో పనిచేసిన తనపై, ఓ సీనియర్ సహోద్యోగి మత మార్పిడికి ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. హిందూ మతాన్ని విడిచి ఇస్లాం స్వీకరిస్తే 'మెరుగైన జీవితం', విదేశాల్లో అవకాశాలు వస్తాయని నమ్మబలికారని, ఓ ముస్లిం వ్యక్తితో సంబంధం కూడా సూచించారని ఆమె తెలిపారు.

ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించడంతో కార్యాలయంలో వేధింపులు ఎక్కువయ్యాయని, పనితీరుపై నెగెటివ్ రిపోర్ట్ ఇస్తామని బెదిరించారని బాధితురాలు పేర్కొన్నారు. చివరికి తనతో బలవంతంగా రాజీనామా చేయించారని వాపోయారు. ఈ విషయంపై హెచ్‌ఆర్, యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోగా, తనపైనే ఎదురు ఫిర్యాదు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిందితురాలు బెంగళూరులో పనిచేస్తున్నట్లు తెలిసింది.

ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పుణే పోలీసులు తెలిపారు. సీనియర్ అధికారి బాలాజీ పంధారే మాట్లాడుతూ, దర్యాప్తు ప్రారంభించామని, కంపెనీ రికార్డులను పరిశీలిస్తున్నామని చెప్పారు. మరోవైపు విప్రో యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ, వేధింపుల పట్ల తమ సంస్థ జీరో-టాలరెన్స్ విధానాన్ని పాటిస్తుందని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. బాధితురాలు తనను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కంపెనీకి లీగల్ నోటీసు కూడా పంపారు.

Wipro Pune Ex Staff Accuses Woman Boss Of Forced Religious Conversion
Religious Conversion

More Telugu News