జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్‌ చేయిస్తానంటే ఒప్పుకోలేదని తల్లిదండ్రుల హత్య!

  • స్టార్టప్‌కు డబ్బులు ఇవ్వకపోవడమూ కోపానికి కారణమని తేల్చిన పోలీసులు
  • నిందితుడు రోహన్‌కు మానసిక జబ్బు లేదని నిర్ధారించిన డాక్టర్లు
  • నిందితుడి బట్టలపై దొరికింది తల్లిదండ్రుల రక్తమేనని గుర్తింపు
  • నలభై మంది సాక్షుల విచారణ తర్వాత ఛార్జిషీట్‌
హత్య అనగానే ఆస్తుల గొడవలో, పెద్ద పగలో ఉంటాయని అనుకుంటాం. కానీ బెంగళూరులో జరిగిన ఈ ఘోరం వెనుక అసలు కారణం తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కేవలం ఒక సిమ్ పోర్టింగ్ వివాదం, స్టార్టప్ డబ్బుల గొడవ చివరకు కన్న తల్లిదండ్రుల దారుణ హత్యలకు దారితీసింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ హత్యలకు సంబంధించిన కారణాలను పోలీసులు తాజాగా వెల్లడించారు.

సిమ్ కార్డ్ తెచ్చిన ముప్పు
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రోహన్ చంద్ర తన జియో నంబర్‌ను ఎయిర్‌టెల్‌కు పోర్ట్ చేయాలనుకున్నాడు. కానీ, విశ్రాంత నావికాదళ అధికారి అయిన అతడి తండ్రి అందుకు ఒప్పుకోలేదు. ఫిబ్రవరి 11న ఈ చిన్న విషయంపైనే తండ్రీకొడుకుల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగి, చివరకు కన్నవారి హత్యకు దారితీసింది.

రూ.10 లక్షల గొడవ
అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివిన రోహన్, ఒక సొంత స్టార్టప్ పెట్టాలనుకున్నాడు. అందుకోసం తండ్రిని రూ.10 లక్షల రూపాయలు అడిగాడు. కానీ, ముందు ఉద్యోగం చూసుకోమంటూ తండ్రి ఆ డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. సిమ్ కార్డు గొడవతో పాటు ఈ ఆర్థిక ఇబ్బంది కూడా అతడిలో కోపాన్ని పెంచింది.

మానసిక స్థితిపై సందేహాలు
కన్నవారిని కత్తులతో పొడిచి చంపిన రోహన్‌కు మానసిక జబ్బు ఉందేమోనని పోలీసులు అనుమానించారు. గతంలో అతడి తల్లి కూడా పొరుగువారితో ఇదే విషయం చెప్పింది. దీంతో పోలీసులు అతడిని నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారం రోజుల పరీక్షల తర్వాత రోహన్‌కు ఎలాంటి మానసిక సమస్యలు లేవని డాక్టర్లు తేల్చేశారు.

ల్యాబ్ రిపోర్టులో నిజాలు
పోలీసులు కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కీలక ఆధారాలు ఉంచారు. ఘటనా స్థలంలో దొరికిన రక్తం మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌లో పరీక్షించారు. రోహన్ బట్టలపై ఉన్న రక్తం అతడి తల్లిదండ్రులదేనని ల్యాబ్ రిపోర్టులో స్పష్టమైంది. సుమారు 40 మంది సాక్షుల స్టేట్‌మెంట్లతో పోలీసులు నిందితుడిపై పక్కా ఆధారాలు సేకరించారు.

Bengaluru
Crime
Parents
Jio
Airtel

More Telugu News