బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే.. 4 గంటల సమయం ఆదా!

  • బెంగళూరు-విజయవాడ మధ్య ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం
  • ప్రయాణ దూరం 110 కి.మీ, సమయం 4 గంటల వరకు ఆదా
  • కడప జిల్లా మీదుగా 123 కి.మీ.. పారిశ్రామికంగా కీలక ప్రయోజనం
  • కొప్పర్తి, హిందూపురం పారిశ్రామిక ప్రాంతాలకు మెరుగవనున్న కనెక్టివిటీ
  • అత్యాధునిక టెక్నాలజీతో ట్రాఫిక్, టోల్ వ్యవస్థల ఏర్పాటు
బెంగళూరు, విజయవాడ నగరాలను కలిపే ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి భారీ ఊతం లభించనుంది. ఆంగ్ల మీడియా కథనం ప్రకారం, జాతీయ రహదారి-544Gలో భాగంగా బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

ఈ కొత్త రహదారి నిర్మాణంతో బెంగళూరు-విజయవాడ మధ్య దూరం సుమారు 110 కిలోమీటర్లు తగ్గనుంది. దీంతో ప్రయాణ సమయం 3 నుంచి 4 గంటలు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గం బెంగళూరు-హైదరాబాద్ (NH-44), చెన్నై-విజయవాడ (NH-16) మార్గాలను అనుసంధానం చేస్తుంది. శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల మీదుగా ఈ హైవే వెళ్లనుంది.

ఈ ప్రాజెక్టు వల్ల అత్యధికంగా లబ్ధి పొందనున్నది కడప జిల్లానే. జిల్లాలోని 12 మండలాల మీదుగా సుమారు 123.5 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. జిల్లాలో ఆరు ప్యాకేజీల కింద రూ.5,377.72 కోట్లతో పనులు చేపడుతున్నట్లు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు.  2025 మార్చి నాటికే అటవీ, వన్యప్రాణుల అనుమతులు లభించడంతో పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. భూసేకరణ ప్రక్రియ కూడా చివరి దశలో ఉంది.

ఈ హైవేతో బెంగళూరు నుంచి హిందూపురం, కొప్పర్తి పారిశ్రామిక కేంద్రాలకు ప్రత్యక్ష కనెక్టివిటీ మెరుగుపడుతుందని మాజీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మార్గంలో అత్యాధునిక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఉపయోగించుకున్న దూరానికే టోల్ చెల్లించే విధానం అమలు చేయనున్నారు. కడప జిల్లా పరిధిలో 7 ఇంటర్‌ఛేంజ్‌లు, 4 వే-సైడ్ అమెనిటీస్ (ప్రయాణికుల సౌకర్య కేంద్రాలు) ఏర్పాటు చేయనుండటం విశేషం.

New Bengaluru Vijayawada Expressway
Link NH-44 With NH-16

More Telugu News