జైలు నుంచి వచ్చాక నాన్న నేరుగా ఇంటికి రాలేదు.. డీకే శివకుమార్ కుమార్తె ఎమోషనల్ పోస్ట్

  • జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
  • తండ్రి గురించి కుమార్తె ఐశ్వర్య భావోద్వేగ పోస్ట్
  • గతంలో జైలు నుంచి రాగానే కార్యకర్తల వద్దకే వెళ్లారని వెల్లడి
  • దశాబ్దాల త్యాగానికి పార్టీ గుర్తింపు ఇచ్చిందన్న ఐశ్వర్య
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం చేయనున్న వేళ, ఆయన పెద్ద కుమార్తె ఐశ్వర్య తన తండ్రి గురించి సామాజిక మాధ్యమాల్లో చేసిన ఒక పోస్ట్ అందరి హృదయాలను హత్తుకుంటోంది. ప్రజాసేవకే అంకితమైన తన తండ్రి నిబద్ధతను వివరిస్తూ ఆమె పంచుకున్న ఓ సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. కొన్నేళ్ల క్రితం తన తండ్రి జైలు నుంచి విడుదలైనప్పుడు జరిగిన ఒక విషయాన్ని ఐశ్వర్య గుర్తుచేసుకున్నారు.

అప్పుడు ఆయన నేరుగా ఇంటికి రాకుండా, ఢిల్లీలో ఎదురుచూస్తున్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారుల వద్దకు వెళ్లారని గుర్తు చేసుకున్నారు. "సరైన చెప్పులు కూడా లేకుండా, తిండి తినకుండా వారు నాన్న కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఆయన ముందు వారి వద్దకే వెళ్లారు" అని ఐశ్వర్య రాశారు. నేరుగా ఇంటికి రానందుకు తాను రెండు రోజులు నాన్నతో మాట్లాడలేదని, కానీ ఆ తర్వాత ఆయన ప్రాధాన్యతలు ప్రజలేనని అర్థం చేసుకున్నానని ఆమె పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కోసం నాలుగు దశాబ్దాలుగా తన తండ్రి చేసిన త్యాగాలను పార్టీ నాయకత్వం గుర్తించి, ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని ఐశ్వర్య పేర్కొన్నారు. "కంగ్రాట్స్ అప్పా" అంటూ తండ్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.

మే 28న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో, కాంగ్రెస్ శాసనసభాపక్షం డీకే శివకుమార్‌ను ఏకగ్రీవంగా తమ నేతగా ఎన్నుకుంది. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆయన్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. జూన్ 3న సాయంత్రం 4:05 గంటలకు బెంగళూరులోని లోక్ భవన్‌లో శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

DK Shivakumar daughter Aisshwarya interesting post
DK Shivakumar daughter

More Telugu News