కమర్షియల్ గ్యాస్‌పై వడ్డన.. గృహ వినియోగదారులకు ఊరట

  • వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
  • ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ. 42 పెరుగుదల
  • గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు
  • అంతర్జాతీయ విమానాలకు ఏవియేషన్ ఫ్యూయల్ ధర తగ్గింపు
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను మరోసారి పెంచాయి. అయితే, గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడంతో సామాన్యులకు ఊరట లభించింది. జూన్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్టు కంపెనీలు ప్రకటించాయి.

తాజా పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 42 పెరిగి రూ.3,113.50కి చేరింది. కోల్‌కతాలో రూ.53.50 పెరగడంతో అక్కడ ధర రూ.3,255.50కి ఎగబాకింది. ముంబై, చెన్నై, హైదరాబాద్ సహా ఇతర ప్రధాన నగరాల్లోనూ ధరలను సవరించారు. అలాగే, 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్ ధర కూడా రూ.11 పెరిగి ఢిల్లీలో రూ. 821.50కి చేరింది.
 
 విమాన ఇంధనం ధర తగ్గింపు
 
మరోవైపు, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ఊరట కల్పిస్తూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరను సుమారు 2.7 శాతం మేర తగ్గించారు. అయితే, దేశీయ విమానాలకు వర్తించే ఏటీఎఫ్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.
 
 పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అంతర్జాతీయంగా సరఫరా సమస్యలు తలెత్తకుండా ఇంధన నిల్వలను పటిష్ఠం చేసుకునే చర్యల్లో భాగంగానే ఈ ధరల పెంపు జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పెంపు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. వారి నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

Commercial Lpg Cylinder
price hike
india fuel

More Telugu News