మోదీ 'విశ్వగురు' అంటుంటారు కానీ ఒక్క పరీక్షను సరిగ్గా నిర్వహంచడం లేదు: రాహుల్ గాంధీ

Rahul Gandhi Slams Modi Over CUET UG Exam Issues
  • సీయూఈటీ యూజీ 2026 పరీక్షలో సాంకేతిక లోపం
  • పలు కేంద్రాల్లో రెండో షిఫ్ట్ పరీక్ష ఆలస్యంగా ప్రారంభం
  • సమస్యను పరిష్కరించామని, అదనపు సమయం ఇస్తామని ఎన్టీఏ ప్రకటన
  • విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ కేంద్రంపై రాహుల్ గాంధీ ఆగ్రహం
దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఇవాళ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ యూజీ) 2026 పరీక్షలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల రెండో షిఫ్ట్ పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సమస్యను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ధృవీకరించింది. ఇంతకుముందు నీట్ (యూజీ) పరీక్ష లీకైంది. ఈ నేపథ్యంలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్నామని ప్రధాని చెబుతుంటారని, కానీ కనీసం ఒక్క పరీక్షను కూడా సజావుగా నిర్వహించడం లేదని విమర్శించారు.

సర్వర్ లోపం కారణంగా కొన్ని పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన పరీక్షను సాయంత్రం 4 గంటలకు ప్రారంభించారు. విద్యార్థులను మధ్యాహ్నం 2:30 గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతించారు. సాంకేతిక సమస్యను పరిష్కరించామని, పరీక్ష సమయం కోల్పోయిన విద్యార్థులకు నష్టపరిహారంగా అదనపు సమయం ఇస్తామని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో జరిగిన ఇతర పరీక్షల వైఫల్యాలను ప్రస్తావిస్తూ, "నీట్, సీబీఎస్ఈ, ఎస్సెస్సీ, ఈరోజు సీయూఈటీ. నాలుగు పరీక్షలు. కోటి మంది విద్యార్థులు. కానీ ఒక్కదాన్నీ నిజాయితీగా నిర్వహించలేకపోయారు" అని ఆయన ఆరోపించారు.

భారత్‌ను 'విశ్వగురువు'గా మారుస్తున్నామని చెబుతూనే, మరోవైపు ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని రాహుల్ మండిపడ్డారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న జాతీయస్థాయి పరీక్షల నిర్వహణలో పదేపదే తలెత్తుతున్న సమస్యలు, పారదర్శకత లోపంపై ఈ ఘటన మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.
Go Back to Shorts
Rahul Gandhi
CUET UG 2024
NEET UG Exam
Exam Leak
NTA
National Testing Agency
Exam Delay

More Telugu News