బాల్క సుమన్పై పీడీ యాక్ట్ పెట్టాలి: ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్
- సింగరేణిపై బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు
- బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- సుమన్కు రైలు పట్టాలు కోసే శాఖను కేసీఆర్ ఇచ్చారని వెంకట్ ఎద్దేవా
సింగరేణిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపింది. ఈ పరిణామంపై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బాల్క సుమన్ అరెస్ట్ కావడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే కారణమని, దీని వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుట్ర దాగి ఉందని వెంకట్ ఆరోపించారు. "మీకు కోపం ఉంటే మాపై దాడి చేయండి, కానీ సామాన్య పేద ప్రజలు ప్రయాణించే రైళ్లపై మీకెందుకు అంత అక్కసు? మీకు ఓట్లేయలేదనే కక్షతోనే పేదలపై ఇలాంటి కుట్రలు చేస్తున్నారా?" అని ఆయన ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపినట్లు గుర్తుచేశారు.
కేసీఆర్ ఒక్కొక్కరికి ఒక్కో వివాదాస్పద బాధ్యత అప్పగించారని.. సుమన్కు రైలు పట్టాలు కోసే శాఖ ఇచ్చారని వెంకట్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని, సుమన్ లాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు.