చనిపోయిన మూడు నెలలకు.. అగ్రనేత అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్‌లో భారీ ఏర్పాట్లు!

  • అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం కారణంగా నెలలపాటు వాయిదా
  • ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ఖమేనీ మరణించినట్లు వెల్లడి
  • ఆయన వారసుడు, కుమారుడు మొజ్తబా కూడా గాయపడి అజ్ఞాతంలో
  • అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా ఓ ప్రధాన కార్యాలయం ఏర్పాటు
దివంగత ఇరాన్ అగ్రనేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల నిర్వహణకు ఆ దేశ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధం కారణంగా నెలలపాటు వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయని ఇరాన్ అధికారిక మీడియా నిన్న‌ వెల్లడించింది.

అంత్యక్రియల ఏర్పాట్ల కోసం ఒక ప్రత్యేక ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు టెహ్రాన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఫర్ ఇస్లామిక్ ప్రొపగాండా అధిపతి మొహ్సెన్ మహమూదీ తెలిపారు. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన తొలి విడత దాడుల్లో 30 ఏళ్లకు పైగా ఇస్లామిక్ రిపబ్లిక్‌కు నాయకత్వం వహించిన ఖమేనీ మరణించారు. ఇదే దాడుల్లో ఆయన కుమారుడు, వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన మొజ్తబా ఖమేనీ కూడా గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. ఏప్రిల్‌లో ఖమేనీకి నివాళిగా ఒక కార్యక్రమం నిర్వహించినప్పటికీ, యుద్ధం కారణంగా పూర్తిస్థాయి అంత్యక్రియలు సాధ్యం కాలేదు.

దేశం నలుమూలల నుంచీ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్‌ నుంచి కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, ఇరు పక్షాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందం ఇంకా కుదరలేదు.

Ali Khamenei
Iran
Ayatollah Ali Khamenei
Funeral
US Israel conflict
Mohsen Mahmoudi
Mojtaba Khamenei
Tehran Coordination Council for Islamic Propaganda

More Telugu News