రైతుల ముంగిటకే మార్కెట్.. 'ఫార్మ్ టు హోమ్' విధానానికి చంద్రబాబు శ్రీకారం

Chandrababu Naidu Introduces Farm to Home System for Farmers
  • రైతు ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేర్చే 'ఫార్మ్ టు హోమ్' విధానం
  • యడవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటుకు పరిశీలన
  • జూలైలో అగ్రికల్చర్ స్కూల్‌కు శంకుస్థాపన
  • రైతు బజార్లలో ప్రకృతి సేద్య ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్లు
రాష్ట్ర వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులు పండించిన పంటలను, ముఖ్యంగా కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేర్చేందుకు 'ఫార్మ్ టు హోమ్' విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOs) ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, ప్రాంతాల వారీగా పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతికూల వాతావరణంలోనూ రైతులు నష్టపోకుండా కనీస మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని, ఈ విధానంలో విజయం సాధించిన రైతుల అనుభవాలను వినియోగించుకోవాలని తెలిపారు. భూసార పరీక్షలు నిర్వహించి, ఆ వివరాలను ఆన్‌లైన్‌లో రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతు బజార్లలో ప్రకృతి సేద్య ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీటి కొరత ఉన్నచోట్ల పీఎండీఎస్-హాఫ్ మూన్ పద్ధతుల్లో సేద్యం చేపట్టాలన్నారు.

ప్రాంతీయ అభివృద్ధికి భారీ ప్రణాళికలు
రాయలసీమను ఉద్యానవన హబ్‌గా మార్చేందుకు రూ.40 వేల కోట్లతో 'పూర్వోదయ' పథకం కింద సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, గోదాముల వంటి మౌలిక వసతులు కల్పించనున్నట్టు సీఎం వివరించారు. దీనికి తోడు రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యడవోలు వద్ద 'కోకో సిటీ' ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించారు. 

అలాగే, జూలై నాటికి మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ నిర్మాణాన్ని పూర్తి చేసి, వినియోగంలోకి తెచ్చేందుకు తక్షణమే రూ.3 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. రాయలసీమలో పండే అరటికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించాలని కూడా అధికారులను ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు క్లస్టర్ల వారీగా ప్రణాళికలు రూపొందించి, రైతు సాధికార సంస్థ ద్వారా హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాలు అందించాలని తెలిపారు.


Go Back to Shorts
Chandrababu Naidu
Farm to Home
Andhra Pradesh Agriculture
Farmer Welfare
FPO
Agriculture Marketing
Natural Farming
Rayalaseema Development
Horticulture Hub
Coco City

More Telugu News