నాకు ఏపీ పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు: ప్రొఫెసర్ నాగేశ్వర్

  • తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌ను కలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్
  • నోటీసులు వచ్చినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ
  • వివాదాస్పద వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు వెల్లడి
  • సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు కోరిన నాగేశ్వర్
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మంగళవారం తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం, తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు ఆయన వివరించారు.

ఇటీవల ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పవన్ కల్యాణ్, అమిత్ షా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తాను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన నాయకుల ఫిర్యాదులతో కాకినాడ, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో ఆయనపై పలు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ క్రమంలో నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను ఏపీ ప్రభుత్వం అప్పుడే ఖండించింది. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ స్వయంగా తనకు నోటీసులు రాలేదని చెప్పడంతో ఈ వదంతులకు తెరపడినట్లయింది.

Nageshwar
Professor Nageshwar
AP Police
CV Anand
Telangana DGP
Pawan Kalyan
YS Jagan Mohan Reddy
Amit Shah
Social Media
Defamation

More Telugu News