ఒడిశాలో ఘోర ప్రమాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురి దుర్మరణం

  • కలహండి జిల్లాలో విషాద ఘటన
  • ఒకరిని రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన మిగతావారు
  • మృతుల్లో ఇంటి యజమాని, ఆయన కుమారుడు
  • బాధితులకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
ఒడిశాలో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. కలహండి జిల్లా మదన్‌పూర్-రాంపూర్ బ్లాక్ పరిధిలోని గౌడ కర్లాంకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లోపల ఉన్న విషవాయువులను పీల్చడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఒకరిని కాపాడబోయి
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగా కడుతున్న సెప్టిక్ ట్యాంక్ లోపల ఉన్న సెంట్రింగ్ సామగ్రిని బయటకు తీయడానికి మొదట ఒక మేస్త్రీ లోపలికి దిగాడు. అయితే ట్యాంక్ లోపల ఆక్సిజన్ లేకపోవడం, విషవాయువులు దట్టంగా ముసురుకోవడంతో అతడు స్పృహతప్పి పడిపోయాడు. లోపల ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ఒకరి వెనుక ఒకరుగా మరో ఐదుగురు ట్యాంకులోకి దిగారు. దురదృష్టవశాత్తూ వారు కూడా ఆ విషవాయువుల ప్రభావానికి లోనై అక్కడికక్కడే కుప్పకూలారు.

మృతుల్లో తండ్రీకొడుకులు
ట్యాంకులో నుంచి ఎలాంటి చప్పుడు రాకపోవడంతో ఆందోళన చెందిన గ్రామస్థులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. లోపల ఉన్నవారిని వెలికితీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుల్లో ముగ్గురు మేస్త్రీలు, ఒక కూలీతో పాటు ఆ ఇంటి యజమాని నిమై పాల్, అతని కుమారుడు ఆకాశ్‌ పాల్ కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన మరో కార్మికుడు ప్రస్తుతం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

ముఖ్యమంత్రి సంతాపం
ఈ దారుణ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ తక్షణమే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Odisha Accident
Kalahandi
Septic Tank
Sewer Gas
Accidental Death
Mohan Charan Majhi
Odisha Government
Financial Assistance
Accident Investigation

More Telugu News