రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడి అరెస్ట్

  • తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడి ఆత్మహత్య కేసు
  • తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతపురం రూరల్ పోలీసులు
  •  జైపాల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా అరెస్ట్

అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు, ఆ పార్టీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేశారు. 2025లో చోటుచేసుకున్న తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడి ఆత్మహత్య కేసు వ్యవహారంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. రాజశేఖర్ రెడ్డితో పాటు జైపాల్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసులు అధికారికంగా ధ్రువీకరించారు.


ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే... గతంలో మృతుడు మహేశ్వర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వర్గానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టాడు. ఈ కారణంతో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి సదరు యువకుడిని తీవ్రంగా బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ బెదిరింపులను తట్టుకోలేకనే మహేశ్వర్ రెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి మలిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజశేఖర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లుగా చెబుతున్న కొన్ని ఆడియోలు, వీడియో ఆధారాలను కూడా ఆయన పోలీసులకు సమర్పించారు.


ఈ ఘటనపై మొదట రైల్వే పోలీసులు కేసు నమోదు చేయగా, కేసు తీవ్రత దృష్ట్యా అనంతపురం రూరల్ పోలీసులు, రాప్తాడు పోలీసులు సంయుక్తంగా లోతైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో లభించిన ఆధారాల ప్రాతిపదికన మంగళవారం ఉదయం నిందితులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డిలను రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్ట్ వ్యవహారం ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.

 

Thopudurthi Rajasekhar Reddy
Anantapur
Raptadu
YS Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh Politics
Suicide Case
Maheswar Reddy
Arrest
Political News

More Telugu News