జనాలు నవ్వుకుంటున్నా 'మావిగన్'ను పట్టుకుని వేలాడుతున్నారు: మంత్రి నారాయణ
- అమరావతి నిర్మాణ వ్యయాలపై వైసీపీ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారన్న నారాయణ
- 30,079 మంది రైతులకు ఇప్పటికే ఫ్లాట్లు కేటాయించామని వెల్లడి
- అమరావతి ద్వారా ఏటా రూ. 12 వేల కోట్ల ఆదాయం వస్తుందన్న మంత్రి
రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతి పరిధిలో శరవేగంగా జరుగుతున్న అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, అధికారుల నివాస భవనాల నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ వ్యయాలపై వైసీపీ నేతలు తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే మాట్లాడితే గత ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లు కూడా భవిష్యత్తులో సున్నా అవ్వడం ఖాయమని హెచ్చరించారు. జనాలు నవ్వుకుంటున్నా 'మావిగన్'ను పట్టుకుని వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు.
అమరావతి కోసం 30,760 మంది రైతులు 35,059 ఎకరాల భూమిని ఇచ్చారని, వారిలో 30,079 మందికి ఇప్పటికే ప్లాట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం నిర్మిస్తున్న నివాస భవనాలను జూన్ నెల నుండి దశలవారీగా జీఏడీకి అప్పగిస్తామన్నారు.
ఖర్చుల వివరాలను వెల్లడిస్తూ.. హైదరాబాద్ సచివాలయానికి చదరపు అడుగుకు రూ.13,768, కొత్త పార్లమెంట్కు రూ.16,916 వ్యయం అవ్వగా, అమరావతి ఐకానిక్ టవర్స్కు రూ.15,000 నుండి రూ.16,000 వరకు ఖర్చవుతుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అమరావతి ద్వారా ఏటా రూ.12 వేల కోట్ల ఆదాయం వస్తుందని, ఇక్కడి మిగులు భూములతోనే తీసుకున్న రుణాలను తీర్చగలమని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు.