పవన్‌తో చివరి సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి: బండ్ల గణేష్

  • పవన్‌తో ప్రపంచం ఉలిక్కిపడే సినిమా తీసి తన బ్యానర్ మూసేస్తానన్న‌ బండ్ల గణేష్
  • చిరంజీవితో సినిమా చేస్తే 30 ఏళ్ల పాటు గుర్తుండిపోవాలని వ్యాఖ్య
  • ప్రస్తుతం ఇండస్ట్రీ ప్రమాద ఘడియల్లో ఉందని ఆందోళన
  • థియేటర్ ఓనర్‌గా ఒక్క రూపాయి కూడా రావడం లేదని ఆవేదన
  • చిన్న బడ్జెట్ చిత్రాల కోసం కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు వెల్లడి
నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్, తన చిరకాల కోరికను బయటపెట్టారు. తన ఆరాధ్య దైవం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో యావత్ ప్రపంచంలోని తెలుగువారంతా ఉలిక్కిపడేలా ఒక భారీ చిత్రాన్ని నిర్మించాలని, ఆ ఒక్క సినిమా తర్వాత ‘పరమేశ్వర ఆర్ట్స్’ బ్యానర్‌ను శాశ్వతంగా మూసివేస్తానని సంచలన ప్రకటన చేశారు.

ఇటీవల ‘రాజా రవీంద్ర టాక్స్’ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌ను 'పవనేశ్వరా', 'దేవరా' అంటూ దేవుడిలా ఆరాధించే ఆయన, తన దేవుడితో మరో సినిమా తీయాలన్నదే తన జీవితాశయమని స్పష్టం చేశారు. "నాకు ఒక కోరిక ఉంది. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో మళ్లీ పవన్ తో సినిమా తీయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ తెలుగోడు ఉలిక్కిపడే విధంగా సినిమా తీసి ఆ బ్యానర్‌ను ఆపేయాలన్నది నా కోరిక" అని బండ్ల గణేష్ తన మనసులోని మాటను చెప్పారు.

ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో సినిమా ఎప్పుడు చేస్తారని అడగ్గా, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. "ఏడు కొండలవాడు ఆ రోజు ఎప్పుడు ఇస్తాడో చూడాలి. ఆయనతో ఏదో ఊరికే సినిమా తీస్తే ఉపయోగం లేదు. 30 ఏళ్ల తర్వాత కూడా మా పిల్లలు గర్వంగా చెప్పుకునేలా బ్లాక్‌బస్టర్ కథతో సినిమా చేయాలి. ‘గబ్బర్ సింగ్’ వచ్చి 14 ఏళ్లైనా ఇంకా మాట్లాడుకున్నట్టే, చిరంజీవితో సినిమా కూడా చరిత్రలో నిలిచిపోవాలి" అని అన్నారు.

అయితే, ప్రస్తుతం చిత్ర పరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని బండ్ల గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మంచి కథలు దొరకడం లేదని, ఏఐ రాకతో ఇండస్ట్రీ భవిష్యత్తుపై భయం కలుగుతోందని అన్నారు. "సినిమాకు మంచి టాక్ వచ్చినా వసూళ్లు రావడం లేదు. బాగాలేకపోతే రెండో రోజే థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. ఇదంతా ఒక మిస్టరీలా ఉంది. పరిశ్రమలో ఏదో పెద్ద మార్పు జరగబోతోంది" అని విశ్లేషించారు. ఒక ఎగ్జిబిటర్‌గా తనకు చెత్త అనుభవం ఎదురైందని, థియేటర్‌పై ఒక్క రూపాయి కూడా రావడం లేదని ఆవేదన చెందారు.

ఇదిలా ఉంటే.. ఇటీవలే 'బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్' అనే పేరుతో కొత్త బ్యానర్ స్థాపించి, ఈటీవీ విన్ ప్రొడక్షన్స్‌తో కలిసి రూ. 4-5 కోట్ల బడ్జెట్‌లో చిన్న సినిమాలు నిర్మించేందుకు సిద్ధమైనట్లు కూడా ఆయన వెల్లడించారు.

Bandla Ganesh
Pawan Kalyan
Chiranjeevi
Tollywood
Telugu cinema
Parameshwara Arts
Raja Ravindra
Gabbar Singh

More Telugu News