పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే

  • దేశంలో ఇంధన ధరల భారం రోజురోజుకూ పెరుగుతోందన్న ఖర్గే
  • రోజువారీ దోపిడీ వల్ల ఎవరు బాగుపడుతున్నారని ప్రశ్న
  • సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి ప్రభుత్వం పెట్రోల్ జల్లుతోందని విమర్శ
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వరంగ చమురు సంస్థలు ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయిస్తున్నాయి. ఈరోజు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు గత రెండు వారాల్లో పలుమార్లు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12, లీటర్ డీజిల్ రూ.95.25గా, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.115.58, డీజిల్ ధర రూ.103.74గా ఉంది.

పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇంధన ధరల భారం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. రోజువారీ దోపిడీ వల్ల ఎవరు బాగుపడుతున్నారని ప్రశ్నించారు. సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోందని విమర్శించారు. రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగుసార్లు పెరిగాయని మండిపడ్డారు.

2014లో లీటర్ పెట్రోల్ రూ.71.41గా ఉంటే ఇప్పుడు రూ.102.12కు చేరుకుందని గుర్తు చేశారు. రోజువారీ ఇంధన దోపిడీ ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. గత పన్నెండేళ్లలో మోదీ ప్రభుత్వం ఇంధనంపై రూ.43 లక్షల కోట్లు దోచుకుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగోసారి పెరగడంతో ఈరోజు హెచ్‌పీపీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ షేర్లు పెరిగినట్లు చెప్పారు. ప్రజల అవసరాల కంటే లాభానికే ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీ నైజమని విమర్శించారు. ఇంధన ధరల పేరుతో రైతుల నుంచి ఎంఎస్ఎంఈల వరకు, సమాజంలోని ప్రతి వర్గం బీజేపీ దోపిడీ భారాన్ని మోస్తోందని అన్నారు.

Mallikarjun Kharge
Petrol price hike
Diesel price hike
Fuel price hike India
Oil prices
Modi government

More Telugu News