డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్... వృద్ధురాలి నుంచి రూ.24 కోట్లు కొట్టేశారు!

  • బెంగళూరులో ఘటన 
  • 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ కేటుగాళ్ల వల
  • అప్రమత్తమైన బ్యాంక్ మేనేజర్‌తో వెలుగులోకి వచ్చిన వైనం
  • అంతర్రాష్ట్ర ముఠాలోని ఐదుగురిని అరెస్ట్ చేసిన సీసీబీ పోలీసులు
  • నిందితుల ఖాతాల్లోని రూ.60 లక్షలు ఫ్రీజ్
బెంగళూరులో 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. శివాజీనగర్‌కు చెందిన 74 ఏళ్ల లక్ష్మీ రామమూర్తి అనే వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు కాజేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు తమను తాము దర్యాప్తు సంస్థల అధికారులమని పరిచయం చేసుకున్నారు. మనీలాండరింగ్ కేసులో మీ వివరాలు ఉన్నాయని ఆమెను బెదిరించారు. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్యలో ఆమెను 'డిజిటల్ అరెస్ట్'లో ఉంచి, నిరంతరం వీడియో కాల్స్‌‌లో పర్యవేక్షిస్తూ విడతలవారీగా 22 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేయించుకున్నారు.

ఇటీవల బాధితురాలు మరోసారి డబ్బు పంపేందుకు 1.3 కిలోల బంగారం తాకట్టు పెట్టడానికి ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లారు. ఆమె తీరుపై అనుమానం వచ్చిన క్యాంటోన్మెంట్ బ్రాంచ్ మేనేజర్, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.

రంగంలోకి దిగిన సీసీబీ పోలీసులు ముంబై, అలహాబాద్, ఢిల్లీ నగరాల్లో నిందితులను అరెస్ట్ చేశారు. వారి బ్యాంకు ఖాతాల్లోని రూ.60 లక్షలను ఫ్రీజ్ చేశారు. బాధితురాలికి ఇటీవల ఆస్తి అమ్మకం ద్వారా భారీగా డబ్బు వచ్చినట్లు తెలుసుకుని నిందితులు లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మిగిలిన డబ్బు రికవరీ కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Lakshmi Ramamoorthy
digital arrest fraud
cyber crime
Bangalore
money laundering
online fraud
cyber police
CCB
Karnataka crime
ICICI Bank

More Telugu News