7000 కి.మీ. దూరం నుంచి హైదరాబాద్ రోగికి ఆపరేషన్.. 5జీ టెక్నాలజీతో అద్భుతం!

  • చైనా నుంచి హైదరాబాద్‌లోని రోగికి రోబోటిక్ సర్జరీ
  • వుహాన్‌లోని భారత వైద్యుడి అరుదైన ఆపరేషన్ 
  • హైదరాబాద్ ఏఐఎన్‌యూ ఆసుపత్రిలో 63 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స
  • 5జీ ఇంటర్నెట్, రోబోటిక్ టెక్నాలజీతో సాధ్యమైన క్లిష్టమైన శస్త్రచికిత్స
  • దూర ప్రాంత రోగులకు వైద్య సేవలు అందించడంలో ఇదో ముందడుగు
ఆధునిక వైద్య సాంకేతికత సరిహద్దులను చెరిపేస్తోంది. సుమారు 7,000 కిలోమీటర్ల దూరంలో చైనాలోని వుహాన్‌లో ఉన్న ఓ భారతీయ వైద్యుడు.. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) ఆసుపత్రిలో ఉన్న రోగికి రోబోటిక్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. అత్యాధునిక 5జీ ఇంటర్నెట్ సాయంతో జరిగిన ఈ శస్త్రచికిత్స వైద్య రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

హైదరాబాద్‌కు చెందిన 63 ఏళ్ల మహిళ మూత్రాశయ సంబంధిత సమస్యతో ఏఐఎన్‌యూ ఆసుపత్రిని సంప్రదించారు. అదే సమయంలో ఆ ఆసుపత్రికి చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ చైనాలోని వుహాన్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ వైద్య సదస్సుకు హాజరయ్యారు. అక్కడ కొత్త రోబోటిక్ టెక్నాలజీ పనితీరును ప్రదర్శించేందుకు లైవ్ సర్జరీలు నిర్వహించారు. అందులో భాగంగా డాక్టర్ గౌస్.. వుహాన్‌ నుంచే హైదరాబాద్‌లోని మహిళకు 'యురేటరల్ రీ-ఇంప్లాంటేషన్' అనే క్లిష్టమైన సర్జరీ చేశారు.

వుహాన్‌లోని టోంగ్జి ఆసుపత్రిలో ఉన్న కన్సోల్ ద్వారా డాక్టర్ గౌస్.. హైదరాబాద్‌లోని రోబోటిక్ వ్యవస్థను నియంత్రించారు. హై-స్పీడ్ 5జీ నెట్‌వర్క్ కారణంగా కేవలం 200 మిల్లీసెకన్ల వ్యవధిలోనే ఆదేశాలు అందడంతో ఆయన చేతి కదలికలకు అనుగుణంగా రోబో చేతులు అత్యంత కచ్చితత్వంతో పనిచేశాయి. 3డీ కెమెరాల సాయంతో ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తూ సుమారు 90 నిమిషాల్లో ఈ సర్జరీని పూర్తి చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌లోని వైద్య బృందం ఆపరేషన్ థియేటర్‌లో సిద్ధంగా ఉంది.

ఈ తరహా టెలీ-రోబోటిక్ సర్జరీలు భవిష్యత్తులో దూర ప్రాంతాల్లోని రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Syed Mohammed Ghouse
Hyderabad
5G technology
Robotic surgery
AINU Hospital
Ureteral reimplantation
Wuhan China
Tele robotic surgery
Healthcare technology

More Telugu News