దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతి
- విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శాంతి
- ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, వివాదాస్పద అధికారిణి శాంతికి ఏసీబీ ప్రత్యేక కోర్టులో స్వల్ప ఉపశమనం లభించింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమెకు న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో గత కొన్ని రోజులుగా జైల్లో ఉన్న శాంతి, రెగ్యులర్ బెయిల్ కోసం ఇప్పటివరకు రెండుసార్లు పిటిషన్లు దాఖలు చేయగా... ఏసీబీ కోర్టు వాటిని పూర్తిగా కొట్టేసింది. అయితే, తాజాగా ఆమె తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన కోర్టు, ఈ నెల 23వ తేదీ (శనివారం) నుంచి 27వ తేదీ వరకు ఐదు రోజుల పాటు మాత్రమే ఆమెకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఐదు రోజుల వ్యవధి ముగిసిన వెంటనే ఆమె తిరిగి కోర్టు ముందు హాజరై, జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
దేవదాయ శాఖలో భారీగా అవినీతికి పాల్పడి, కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆమె నివాసాలపై దాడులు చేసి, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు విధించిన షరతులకు లోబడి ఆమె జైలు నుండి తాత్కాలికంగా బయటకు రానున్నారు.