జగన్‌పై మంత్రి నాదెండ్ల ఫైర్.. అన్ని విమర్శలకు ఘాటు కౌంటర్

Nadendla Manohar Fires Back at Jagans Criticisms
  • దీపం పథకంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల ఆరోపణ
  • మధ్యాహ్న భోజనం బియ్యంపై విమర్శలు అవగాహనారాహిత్యంతో చేసినవేనని వ్యాఖ్య
  • స్పెషల్ ఫ్లైట్లపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు.. రూ.222 కోట్లు ఖర్చు చేశారని విమర్శ
  • 5 కిలోమీటర్ల దూరం కోసం హెలికాప్టర్ వాడిన ఘనత జగన్‌దేనని ఎద్దేవా
  • అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తించకుండా సీఎంపై వ్యాఖ్యలు సరికాదని ఖండన
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన విమర్శలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీపం పథకం, మధ్యాహ్న భోజనం నాణ్యత, ప్రత్యేక విమానాల వినియోగం వంటి అంశాలపై జగన్ పూర్తిగా అసత్యాలు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్ అన్ని విమర్శలకు గణాంకాలతో సహా ఘాటుగా సమాధానమిచ్చారు.

దీపం పథకంపై పారదర్శకంగా ఉన్నాం
"దీపం పథకం కింద అర్హులైన వారందరికీ గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని, దీన్ని కూడా జగన్ రాజకీయం చేయడం దారుణం" అని మనోహర్ అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే నాలుగు విడతలుగా ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో దాదాపు 3.77 కోట్ల మంది లబ్ధిదారులకు రూ. 3,037 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని వివరించారు. ప్రస్తుతం ఐదో విడత కొనసాగుతోందని, ఇప్పటికే 48 లక్షల మంది బుక్ చేసుకున్నారని చెప్పారు. 

"ఇది జగన్ ప్రభుత్వంలో లాగా బటన్ నొక్కే కార్యక్రమం కాదు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈకేవైసీ, ఆధార్ అనుసంధానం ద్వారా పారదర్శకంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో కోటి 20 లక్షల కనెక్షన్లు ఉన్నా, డబుల్ కనెక్షన్లు, కమర్షియల్ కనెక్షన్లు, అర్హత లేనివి పోగా, అర్హులందరికీ పథకం అందుతోంది" అని స్పష్టం చేశారు.

మధ్యాహ్న భోజనంపై సవాల్ 
డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై జగన్ చేసిన విమర్శలను మనోహర్ తిప్పికొట్టారు. "పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువ ధర ఉన్నా, మన రైతులు త్యాగం చేసి ప్రభుత్వానికి నాణ్యమైన బీపీటీ, సోనా మసూరి బియ్యాన్ని అందించారు. క్యూఆర్ కోడ్ ట్యాగింగ్‌తో పండించిన రైతు నుంచి పాఠశాలకు చేరే వరకు ప్రతి దశను పారదర్శకంగా ట్రాక్ చేస్తున్నాం. దమ్ముంటే ఏ పాఠశాలకైనా వచ్చి భోజనం నాణ్యతను పరిశీలించాలని జగన్‌కు నేను సవాల్ విసురుతున్నాను" అని అన్నారు.

హెలికాప్టర్ వాడిన ఘనత జగన్‌ది
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రయాణాలపై జగన్ చేసిన విమర్శలపై నాదెండ్ల తీవ్రంగా స్పందించారు. "ప్రపంచంలోనే అరుదైన రికార్డు జగన్‌కు ఉంది. ఉండవల్లిలోని తన ఇంటి నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని అమరావతికి హెలికాప్టర్‌లో వెళ్లిన మహానుభావుడు ఆయన. తన ఐదేళ్ల పాలనలో స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్ల కోసం రూ. 222 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసిన జగన్, ఈరోజు ఇతరులను విమర్శించడం హాస్యాస్పదం" అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ పనులకు పార్టీ నిధులతో, వ్యక్తిగత పనులకు తన సొంత సంపాదనతో ప్రయాణిస్తారని, జగన్‌లా కాంట్రాక్టర్లను బెదిరించి ప్రైవేట్ విమానాల్లో తిరగలేదని అన్నారు.

అమరావతిపై పైశాచిక ఆనందం 
అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తించకుండా, ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలను నాదెండ్ల తీవ్రంగా ఖండించారు. "అమరావతి రైతుల క్షోభను చూసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. రాజధాని కోసం రైతులు పడిన బాధను, ప్రాణత్యాగాలను విస్మరించి మాట్లాడటం జగన్ అహంకారానికి నిదర్శనం. మూడు గీతలు గీస్తే రాజధాని అయిపోతుందనుకోవడం మూర్ఖత్వం. ఐదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి, కనీస సమాచారం లేకుండా బురదజల్లే కార్యక్రమాలు మానుకోవాలి" అని హితవు పలికారు.
Go Back to Shorts
Nadendla Manohar
Jagan Mohan Reddy
Andhra Pradesh
YS Jagan
Chandrababu Naidu
TDP
YSRCP
Midday Meal Scheme
Deepam Scheme
Amaravati

More Telugu News