రోజుకు రూ.2 వేలు... హైదరాబాద్ జైల్లో ఒక రోజు ఖైదీగా గడిపే చాన్స్!

  • హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో 'ఫీల్ ది జైల్' కార్యక్రమం ప్రారంభం
  • ఫీజు చెల్లించి 12 లేదా 24 గంటలు జైలులో గడిపే అవకాశం
  • ఖైదీల జీవనశైలి, స్వేచ్ఛ విలువపై అవగాహన కల్పించడమే లక్ష్యం
  • జైలు పరిణామ క్రమాన్ని తెలిపేలా కొత్తగా జైల్ మ్యూజియం ఏర్పాటు
  • ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైలులో అధికారులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'ఫీల్ ది జైల్' పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా సాధారణ పౌరులు కూడా జైలు జీవితాన్ని ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం కల్పిస్తున్నారు. ఖైదీల జీవనశైలి, వారు ఎదుర్కొనే పరిస్థితులు, స్వేచ్ఛ విలువ గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో భాగంగా 24 గంటల పాటు జైలులో గడపాలనుకునే వారు రూ. 2,000 చెల్లించాల్సి ఉంటుంది. 12 గంటల అనుభవం కోసం రూ. 1,000 ఫీజుగా నిర్ణయించారు. ఇందులో పాల్గొన్న వారికి ప్రత్యేకంగా రూపొందించిన జైలు గదులలో బస కల్పిస్తారు. ఖైదీలకు ఇచ్చే భోజనం అందించి, జైలు నిబంధనలు, ఖైదీల దినచర్యను పాటింపజేస్తారు.

మంగళవారం చంచల్‌గూడలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్ఐసీఏ) ప్రాంగణంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. దీంతో పాటే కొత్తగా ఏర్పాటు చేసిన జైల్ మ్యూజియంను కూడా ఆయన ప్రారంభించడం విశేషం. ఈ మ్యూజియంలో నిజాం కాలం నాటి జైళ్ల నుంచి ఆధునిక సంస్కరణ కేంద్రాల వరకు జరిగిన మార్పులను ప్రదర్శనకు ఉంచారు. పాతకాలపు సంకెళ్లు, జైలు గదులతో పాటు భక్త రామదాసు, దాశరథి కృష్ణమాచార్యులు వంటి ప్రముఖులు జైలు జీవితం గడిపిన వివరాలను పొందుపరిచారు. అంతేగాక నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణంలో ఖైదీల పాత్ర వంటి ఆసక్తికరమైన అంశాలను ఈ మ్యూజియంలో చూడవచ్చు.

ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. "జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, సంస్కరణ, పరివర్తన కేంద్రాలుగా చూడాలి. నేరస్థులకు శిక్షతో పాటు పునరావాసం, రెండో అవకాశం కల్పించడంపై ఒక ప్రగతిశీల సమాజం దృష్టి సారించాలి" అని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం రాష్ట్ర సంస్కరణ చర్యలలో ఒక కొత్త అధ్యాయమని, దీనివల్ల జైళ్ల పరిపాలన, ఖైదీల పునరావాసంపై ప్రజలకు మెరుగైన అవగాహన కలుగుతుందని జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా తెలిపారు.

గతంలో సంగారెడ్డి హెరిటేజ్ జైలు మ్యూజియంలో ప్రారంభించిన 'ఒక రోజు జైలు అనుభవం' కార్యక్రమం నుంచి స్ఫూర్తి పొంది, మరింత వ్యవస్థీకృతంగా చంచల్‌గూడలో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, డబ్బులు చెల్లించి ఖైదీగా ఒక్కరోజు గడపాలన్న ఆలోచనపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు.



Chanchalguda Jail
Feel the Jail
Hyderabad Jail
Telangana Jail Tourism
Shiv Pratap Shukla
Soumya Mishra
Jail Experience
Prison Reform
Heritage Jail
Nagarjuna Sagar Dam

More Telugu News