షణ్ముగం నివాసానికి విజయ్... అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలతో కీలక భేటీ
- తమిళనాడు అసెంబ్లీలో రేపే బలపరీక్ష
- విజయ్ టీవీకేకు మద్దతు ప్రకటించిన షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు
- పూర్తిగా ప్రమాదంలో పడిపోయిన అన్నాడీఎంకే ఉనికి
తమిళనాడు రాజకీయాల్లో మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. రేపు (మే 13) జరగనున్న ఫ్లోర్ టెస్ట్ కు ముందు అన్నాడీఎంకేలో చీలిక రావడం విజయ్ ప్రభుత్వానికి పెద్ద ఊరటనిచ్చే పరిణామం అని చెప్పవచ్చు.
ప్రభుత్వ ఏర్పాటుకు ముందు మెజారిటీ మార్క్ (118)కు కొద్దిగా దూరంలో నిలిచిన టీవీకే అధినేత విజయ్ క్రమంగా పలు పార్టీల నుంచి మద్దతు లభించింది. రేపు (మే 13) బలపరీక్ష నేపథ్యంలో, అన్నాడీఎంకే సీనియర్ నేత సీవీ షణ్ముగం నాయకత్వంలో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవ్వడం సంచలనం రేపింది. తాజాగా రెబల్ నేత షణ్ముగం ఇంటికి విజయ్ స్వయంగా వెళ్లారు. షణ్ముగం, వేలుమణి సహా 30 మంది ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, మంత్రి పదవుల కేటాయింపుపై ఈ భేటీలో విజయ్ చర్చించినట్లు సమాచారం. ఈ పరిణామం విజయ్ ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి మార్గం సుగమం చేసింది.
పార్టీపై పట్టు కోల్పోయిన పళనిస్వామికి ఇప్పుడు కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు. గత ఎన్నికల్లో పొత్తుల విషయంలో ఆయన అనుసరించిన మొండి వైఖరే పార్టీలో అసంతృప్తికి, తాజా చీలికకు ప్రధాన కారణమని సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. షణ్ముగం, వేలుమణి వంటి కీలక నేతలు విజయ్ వైపు మొగ్గు చూపడంతో అన్నాడీఎంకే ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది.