వెయ్యేళ్ల నాటి నిధి బయపటడింది... అంతా స్వచ్ఛమైన బంగారం!
- డెన్మార్క్ లో బయటపడ్డ వెయ్యేళ్ల క్రితం నాటి బంగారు కడియాలు
- వైకింగ్ యుగం నాటివని నిర్ధారించిన నిపుణులు
- వీటి తయారీకి ఉపయోగించిన లోహ మిశ్రమాలపై పరిశోధిస్తున్న నిపుణులు
డెన్మార్క్ దేశ చరిత్రలో ప్రఖ్యాతిగాంచిన వైకింగ్ యుగం నాటి బంగారు నిధి బయటపడటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పురాతత్వ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళితే... డెన్మార్క్లోని హిమ్మర్ల్యాండ్ ప్రాంతంలోని 'రోల్డ్ స్కోవ్' అడవిలో ఒక వ్యక్తికి కొన్ని బంగారు ఆభరణాలు కనిపించాయి. పురాతత్వ శాస్త్రవేత్తలు మెటల్ డిటెక్టర్లతో గాలించగా, అక్కడ 762.5 గ్రాముల బరువున్న ఆరు అద్భుతమైన బంగారు కడియాలు లభ్యమయ్యాయి. ఇవి 10వ శతాబ్దానికి చెందినవని, బహుశా 'హరాల్డ్ బ్లూటూత్' కాలం నాటివని నిపుణులు నిర్ధారించారు. డానిష్ చరిత్రలో ఇప్పటివరకు లభించిన వైకింగ్ బంగారు నిధుల్లో ఇది మూడవ అతిపెద్ద నిధి కావడం విశేషం.
నార్త్ జట్లాండ్ మ్యూజియం ప్రతినిధి టోర్బెన్ సారౌ అభిప్రాయం ప్రకారం, ఈ ఆరు ఉంగరాలు దాదాపు ఒకే రకమైన నైపుణ్యంతో తయారు చేయబడ్డాయి. ఇవి అప్పట్లో అత్యంత శక్తివంతులైన లేదా సంపన్నమైన వైకింగ్ ప్రభువులకు చెందినవిగా భావిస్తున్నారు. సాధారణంగా ఆ కాలంలో వెండి ఆభరణాలు ఎక్కువగా కనిపించేవి, కానీ ఇంత స్వచ్ఛమైన మరియు భారీ మొత్తంలో బంగారం లభించడం చాలా అరుదు. ఇవి ఏవైనా సమాధుల వద్ద కాకుండా, అడవి మార్గంలో దొరకడం వల్ల.. వీటిని శత్రువుల భయం వల్ల దాచిపెట్టి ఉండవచ్చు లేదా దేవుళ్లకు మొక్కుబడిగా సమర్పించి ఉండవచ్చని పురాతత్వ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
డెన్మార్క్ చట్టం ప్రకారం, ఇలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న వస్తువులను వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలి. ఈ కడియాలను డెన్మార్క్ నేషనల్ మ్యూజియంకు తరలించారు. అక్కడ నిపుణులు వీటి తయారీలో ఉపయోగించిన లోహ మిశ్రమాలు, ఆ కాలం నాటి కళాఖండాల నైపుణ్యాన్ని పరిశోధిస్తున్నారు. 1000 సంవత్సరాల నాటి ఈ బంగారం ద్వారా నాటి సామాజిక స్థితిగతులు, సంపద పంపిణీపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.