కాకినాడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావు దారుణహత్య

  • గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన కానిస్టేబుల్
  •  పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  •  నిందితుల కోసం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన, ప్రత్యేక బృందాల ఏర్పాటు
కాకినాడ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్‌పీ) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. కాకినాడ గాంధీనగర్‌లోని రెడ్ క్రాస్ భవనం సమీపంలో ఆదివారం రాత్రి ఈ సంఘటన జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, మృతుడిని ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావు (46)గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్, ఫింగర్‌ప్రింట్ నిపుణులు ఘటనా స్థలం నుంచి కీలక ఆధారాలు సేకరించారు.

ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పాత కక్షల కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా, నాగేశ్వరరావు కొంతకాలంగా సస్పెన్షన్‌లో ఉన్నట్లు సమాచారం.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. నగర నడిబొడ్డున కానిస్టేబుల్ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.

Nageswara Rao
APSP Constable
Kakinada
Murder
Andhra Pradesh Police
Crime
Gandhi Nagar
CCTV Footage

More Telugu News