మోదీకి వెంకటగిరి జామ్దానీ శ్రీవారి చిత్రం... బలపడుతున్న నమో-నారా బంధం!

  • హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆతిథ్యం
    వెంకటగిరి జామ్దానీ నేతతో నేసిన శ్రీవారి చిత్రాన్ని బహూకరించిన సీఎం కుటుంబం
    మంత్రి నారా లోకేష్‌ను ఆప్యాయంగా పలకరించిన ప్రధాని
    గంటకు పైగా చంద్రబాబు కుటుంబ సభ్యులతో గడిపిన నరేంద్ర మోదీ
    రాజకీయ బంధంతో పాటు బలపడుతున్న కుటుంబ అనుబంధం
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం అరుదైన, ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తమ కుటుంబం తరఫున ఒక విశిష్టమైన బహుమతిని అందించారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కళావైభవానికి ప్రతీకగా నిలిచే వెంకటగిరి జామ్దానీ నేతతో ప్రత్యేకంగా రూపొందించిన శ్రీవారి చిత్రపటాన్ని కానుకగా సమర్పించారు. తిరుమల శ్రీవారిని కీర్తించే శ్లోకంతో పాటు నేసిన ఈ చిత్రపటం రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదకు అద్దం పట్టేలా ఉంది. తమ ఇంటికి వచ్చిన విశిష్ట అతిథికి ఏపీ సంప్రదాయాన్ని ప్రతిబింబించే కానుకను అందించి చంద్రబాబు కుటుంబం తమ గౌరవాన్ని చాటుకుంది.

తన అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ, తన బిజీ షెడ్యూల్‌లోనూ చంద్రబాబు కుటుంబానికి ప్రత్యేకంగా గంటకు పైగా సమయం కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ వంటకాలతో తేనీటి విందు ఇచ్చారు. ఈ భేటీలో ప్రధాని మోదీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను ఆప్యాయంగా పలకరించారు. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం మరోసారి స్పష్టంగా కనిపించింది. ఇది కేవలం టీడీపీ-బీజేపీ రాజకీయ బంధం మాత్రమే కాదని, ప్రధాని మోదీకి, నారా కుటుంబానికి మధ్య బలమైన వ్యక్తిగత అనుబంధం ఉందని ఈ సంఘటన నిరూపిస్తోందని టీడీపీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రధాని మోదీ, నారా లోకేష్ మధ్య మొదటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో అనేక సందర్భాల్లో లోకేష్ పనితీరును, నాయకత్వ లక్షణాలను ప్రధాని బహిరంగంగానే ప్రశంసించారు. ఎన్నికల సమయంలో కూటమి సభల నిర్వహణ బాధ్యతలను లోకేష్ సమర్థంగా నిర్వర్తించడాన్ని మోదీ గుర్తించి అభినందించారు. అంతకుముందు కూడా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను విజయవంతం చేసినందుకు లోకేష్‌ను కొనియాడారు. "గతసారి చూసినప్పటి కంటే బరువు తగ్గావు లోకేష్" అంటూ ఒక సభలో ప్రధాని వ్యాఖ్యానించడం వారి మధ్య ఉన్న చనువుకు నిదర్శనం.

ఈ అనుబంధంతోనే గతంలో నారా లోకేష్‌ను కుటుంబసమేతంగా ఢిల్లీలోని తన నివాసానికి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో దాదాపు రెండు గంటల పాటు గడిపారు. ఆ భేటీలో దేవాన్ష్‌ను ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రధాని ఆప్యాయంగా మాట్లాడారు. లోకేష్ తన పాదయాత్ర విశేషాలతో రూపొందించిన 'యువగళం' కాఫీ టేబుల్ బుక్‌ను ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. తాను గురువుగా భావించే మోదీ మార్గదర్శకత్వంలోనే ముందుకు సాగుతానని లోకేష్ పలు సందర్భాల్లో చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో 'డబుల్ ఇంజన్ సర్కార్' వేగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఈ బంధం కీలకంగా మారుతోంది.

Narendra Modi
Chandrababu Naidu
Nara Lokesh
AP Politics
TDP BJP Alliance
Venkata Giri Jamdhani
Srivari Painting
Hyderabad Visit
Telugu Desam Party
Andhra Pradesh

More Telugu News