గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లు బేజారు

  • జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × గుజరాత్ టైటాన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసిన గుజరాత్
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (84), సాయి సుదర్శన్ (55) అద్భుత అర్ధశతకాలతో చెలరేగడంతో గుజరాత్ ఈ భారీ స్కోరును నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ యశస్వి జైస్వాల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, అతని నిర్ణయం తప్పు అని నిరూపిస్తూ గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. రాజస్థాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 118 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సాయి సుదర్శన్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేయగా, కెప్టెన్ గిల్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.

ఓపెనర్లు అందించిన శుభారంభాన్ని తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా చివర్లో వాషింగ్టన్ సుందర్ (20 బంతుల్లో 37 నాటౌట్), రాహుల్ తెవాటియా (4 బంతుల్లో 14 నాటౌట్) వేగంగా ఆడటంతో గుజరాత్ స్కోరు అమాంతం పెరిగింది.

రాజస్థాన్ బౌలర్లలో దాదాపు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ప్రధాన బౌలర్లు జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే తీవ్రంగా నిరాశపరిచారు. బ్రిజేష్ శర్మ 2 వికెట్లు పడగొట్టినప్పటికీ 47 పరుగులు ఇచ్చాడు. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసి కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. దీంతో, సొంత మైదానంలో ఆడుతున్న రాజస్థాన్ ముందు గుజరాత్ 230 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

Shubman Gill
Sai Sudharsan
Gujarat Titans
Rajasthan Royals
IPL 2024
Indian Premier League
Cricket
Jaipur
Yashasvi Jaiswal
Washington Sundar

More Telugu News