బెంగాల్‌లో అధికారం మారగానే.. మమతను అన్‌ఫాలో చేసిన కోల్‌కతా పోలీసులు!

  • బెంగాల్ కొత్త సీఎంగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
  • ఎక్స్ లో మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలను అన్‌ఫాలో చేసిన కోల్‌కతా పోలీసులు
  • ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, సీఎం సువేందులను ఫాలో అవుతున్న పోలీసులు
  • సోషల్ మీడియాలో 'సీఎం' హోదాను తొలగించిన మమతా బెనర్జీ
  • 207 స్థానాలతో బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టిన బీజేపీ
పశ్చిమ బెంగాల్‌లో అధికారం మారడంతోనే అక్కడి ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, కోల్‌కతా పోలీసులు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో కీలక మార్పులు చేశారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీలను అన్‌ఫాలో చేసి, ఆ స్థానంలో కొత్త ప్రభుత్వ పెద్దలను చేర్చారు.

ప్రస్తుతం కోల్‌కతా పోలీసులు ఫాలో అవుతున్న వారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, నూతన సీఎం సువేందు అధికారి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి కార్యాలయం, హోంమంత్రి కార్యాలయం వంటి ఖాతాలు ఉన్నాయి. మొత్తం 42 ఖాతాలను ఫాలో అవుతున్న పోలీసుల జాబితాలో మమత, అభిషేక్‌లకు చోటు లేకపోవడం గమనార్హం.

గత సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 207 స్థానాలతో ఘన విజయం సాధించి, బెంగాల్‌లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నందిగ్రామ్, భవానీపూర్ స్థానాల్లో గెలిచిన సువేందు అధికారి, రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు హాజరయ్యారు.

మరోవైపు, సువేందు ప్రమాణ స్వీకారం తర్వాత మమతా బెనర్జీ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి 'ముఖ్యమంత్రి' అనే హోదాను తొలగించారు. ఇవాల సువేందుతో పాటు మరో ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. వారిలో మహిళా నేత అగ్నిమిత్రా పాల్ కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం, సీఎం సువేందు అధికారి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.



Suvendu Adhikari
West Bengal
Mamata Banerjee
Kolkata Police
BJP
Narendra Modi
Amit Shah
Assembly Elections
Abhishek Banerjee

More Telugu News