మంత్రి కొండా సురేఖ 'జైశ్రీరామ్' వ్యాఖ్యలపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం

Raja Singh Angered by Minister Konda Surekhas Jai Shree Ram Remarks
  • కొండా సురేఖ ఏ శాఖకు మంత్రో గుర్తుంచుకోవాలన్న రాజాసింగ్
  • జైశ్రీరామ్ అంటే కొండంత బలం వస్తుందన్న రాజాసింగ్
  • రేవంత్ రెడ్డి ఆమెను పిలిపించి రాజీనామా కోరాలని డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఏబీవీపీలో ఉన్నప్పుడు 'జైశ్రీరామ్' అన్నారని, మరి తన కేబినెట్ మంత్రికి దానిని నేర్పించలేదా అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. 'జైశ్రీరామ్' అంటే పైనుంచి డబ్బులు రాలుతాయా అని ప్రశ్నించిన మంత్రి కొండా సురేఖపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి అంటే దేవుడికి అనుకూలంగా ఉండాలని, కానీ కొండా సురేఖ మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

కొండా సురేఖ ఏ శాఖకు మంత్రో గుర్తుంచుకోవాలని హితవు పలికారు. జైశ్రీరామ్ అంటే కొండంత బలం వస్తుందని, కానీ అనుచితంగా మాట్లాడితే మంత్రి పదవి ఊడిపోతుందని ముఖ్యమంత్రి ఆమెకు చెప్పాలని సూచించారు. కొండా సురేఖ ఆ వ్యాఖ్యలు చేసినందుకు ఏం చర్యలు తీసుకున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. తెలంగాణలో దేవాదాయ శాఖ భూముల కబ్జాలపై ఆమె దృష్టి సారించాలని కోరారు. 

హైదరాబాద్‌లోని పాతబస్తీలో దేవుడి భూములను మజ్లిస్ పార్టీ నాయకులు కబ్జాలు చేశారని ఆరోపించారు. దేవాదాయ శాఖ అధికారులు ఆ పార్టీ నేతలతో కుమ్మక్కై కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దేవాలయాల అభివృద్ధి మీద ధ్యాస లేదని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ నేతలు ఇచ్చే కమీషన్ల మీదనే మంత్రికి ధ్యాస ఉన్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాముడి నామాన్ని ఎదిరించాలనుకున్న వారు గాల్లో కొట్టుకుపోతారని హెచ్చరించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆమెను పిలిపించి రాజీనామా చేయించాలని, లేకపోతే కేసీఆర్ లాగే మునిగిపోతారని హెచ్చరించారు.
Go Back to Shorts
Raja Singh
Konda Surekha
Revanth Reddy
Jai Shree Ram
Telangana
Devadaya Department

More Telugu News