రైతులకు వేగంగా విత్తన సరఫరా చేయాలి: చంద్రబాబునాయుడు

  • మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
  • పంటలకు ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా అధిక ఆదాయం
  • వ్యవసాయ, ఉద్యాన పంటల కొనుగోళ్ల అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఈ ఏడాది మే 15 నుంచే రైతులకు సాగునీరు అందించనున్న దృష్ట్యా రాష్ట్రంలో వేగంగా విత్తన సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసాయ శాఖకు దిశానిర్దేశం చేశారు. విత్తనాల సరఫరా కోసం రూ.200 కోట్లు కేటాయించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో బుధవారం రాష్ట్రంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ తదితర పంటల కొనుగోళ్లపై ముఖ్యమంత్రి వ్యవసాయ, ఉద్యాన శాఖలతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షకు మంత్రి కె. అచ్చెన్నాయుడు, వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు ధరలు దక్కేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా పంటలకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన పంట దిగుబడులు వచ్చేందుకు కృషి చేయాలని సూచించారు.

మరిన్ని పంటలను ప్రకృతి సేద్యం విధానంలో సాగు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సేంద్రీయ సాగుకు కంపోస్టు ఎరువును సరఫరా చేసేలా చూడాలన్నారు.  ఈ ఏడాది 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట ఉత్పత్తి వస్తుందని అధికారులు వివరించారు. మొక్క జొన్న సహా ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు.

మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలని అన్నారు. అరటి, ఆయిల్ పామ్, మిర్చి, కోకో లాంటి పంటలకు సంబంధించి ధరల సమస్య లేదని రైతులకు మంచి ధర లభిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సీజన్ కంటే ముందే రాష్ట్రంలోని నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను సరఫరా చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

వచ్చే పంట సీజన్ కు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. నాఫెడ్ నుంచి మినుములు ఇతర వాణిజ్య పంటల్ని కొనుగోలు చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు. పీఎండీఎస్ పథకం ద్వారా తక్కువ యూరియా వినియోగానికి ఇచ్చే ప్రోత్సాహకం పై కేంద్రంతో మాట్లాడాలని వారికి సూచించారు. మదనపల్లె లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి  అన్నారు.

Chandrababu Naidu
Andhra Pradesh
Seed Supply
Agriculture
Farmers Welfare
Crop Procurement

More Telugu News