ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించిన గవర్నర్

  • లోక్ భవన్ ఆహ్వాన ప్రకటన విడుదల
  • సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలవనున్న విజయ్
  • విజయ్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన కాంగ్రెస్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పంపించారు. ఈ మేరకు ఆహ్వాన ప్రకటనను లోక్ భవన్ విడుదల చేసింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయ్ గవర్నర్‌ను కలుస్తారు. టీవీకేకు మద్దతిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అన్నాడీఎంకే పార్టీలోనూ పలువురు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని చెబుతున్నారు.

ఈ క్రమంలో, విజయ్ పార్టీ బలాన్ని నిరూపించుకోవడం కష్టమేమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం 118. విజయ్ పార్టీ 108 స్థానాల్లో గెలుపొందగా, మరో పదిమంది ఎమ్మెల్యేలు తక్కువ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయ్‌కి మద్దతిచ్చేందుకు వివిధ పార్టీలు మొగ్గు చూపుతున్నాయి.

రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మాట్లాడుతూ, తనకు టీవీకే నుంచి ఒక లేఖ అందిందని తెలిపారు. వారు ఈరోజు సాయంత్రం తనను కలుస్తారని అన్నారు. తమకు మెజారిటీ ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని వారు కోరినట్లు చెప్పారు. ఈరోజు సాయంత్రం విజయ్ తన అపాయింట్‌మెంట్ కోరారని తెలిపారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని అన్నారు.

Vijay
Tamil Nadu Assembly Elections
TVK Party
Governor Rajendra Vishwanath Arlekar
Tamil Nadu Government Formation

More Telugu News