రేవంత్ రెడ్డి అందుకే కవితతో పార్టీ పెట్టించారు: ధర్మపురి అరవింద్

  • కేసీఆర్‌ను కవితతో తిట్టించడానికే టీఆర్ఎస్ పుట్టిందన్న ఎంపీ
  • మద్యం పాలసీ కేసులో కవితకు క్లీన్ చిట్ రాలేదన్న బీజేపీ ఎంపీ
  • కవిత టీఆర్ఎస్ పార్టీతో ఎవరికీ నష్టం లేదన్న అరవింద్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తిట్టించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కవితతో పార్టీని పెట్టించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. కవిత స్థాపించిన 'టీఆర్ఎస్' ప్రభావం కేసీఆర్, కేటీఆర్ పైనే ఉంటుందని అన్నారు. ఇక ఏ పార్టీపై ప్రభావం ఉండదని అభిప్రాయపడ్డారు. కవిత పార్టీకి రేవంత్ రెడ్డి అండ ఉందని ఆరోపించారు. మద్యం పాలసీ కేసులో ఆమెకు క్లీన్ చిట్ రాలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోందని తెలిపారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కవిత టీఆర్ఎస్ పార్టీతో ఎవరి పైనా ప్రభావం ఉండదని అన్నారు. బీజేపీకి మాత్రం మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 10న తెలంగాణలో మోదీ పర్యటన ఉందని అన్నారు. మోదీ పర్యటనతో కేసీఆర్, రేవంత్ రెడ్డితో పాటు ఆయా పార్టీల్లో వణుకు పుడుతోందని విమర్శించారు. 2028 ఎన్నికలకు నాంది ఈ మోదీ పర్యటన అన్నారు. బీజేపీ ఇప్పటికే దేశమంతా జెండా ఎగురవేసిందని, ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోనూ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వరుస విజయాలతో ప్రాంతీయ పార్టీల్లో వణుకు ఖాయమని అన్నారు.

బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణ అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో ప్రస్తుతం అభద్రతాభావం నెలకొని ఉందని, మరోవైపు కాంగ్రెస్ పార్టీని ప్రజలు మరిచిపోయారని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే విపక్షాలు వ్యతిరేకించాయని మండిపడ్డారు. దీనితో మహిళ బిల్లుకు ఎవరు వ్యతిరేకమో ప్రజలకు తెలిసిందని అన్నారు. ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజలపై అమితమైన ప్రేమ ఉందని అన్నారు.

Dharmapuri Arvind
Revanth Reddy
Kavitha
BRS
TRS Party
Telangana Politics
BJP
KCR
PM Modi

More Telugu News