చంద్రబాబుకు అమరావతిపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు: విడదల రజిని
- కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదన్న రజిని
- అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని ఆరోపణ
- జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని వ్యాఖ్య
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి అమరావతిలోని అద్దాల మేడలపై ఉన్న ప్రేమ సామాన్య ప్రజలపై లేదని ఆమె మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా అని ప్రశ్నించిన ఆమె, జగన్ హయాంలో 66 లక్షలకు పైగా ఉన్న పెన్షన్లలో ఇప్పుడు ఏకంగా 6 లక్షల పెన్షన్లను కట్ చేశారని ఆరోపించారు. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తామన్న హామీని కూడా గాలికి వదిలేశారని విమర్శించారు.
ఒకవైపు రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ, ఆ నిధులను చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తమ విలాసాల కోసం, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ప్రయాణాల కోసం వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణాల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని, అడుగుకు రూ.18,500 పైనే ఖర్చు చేయడం దేశంలో ఎక్కడా లేని విడ్డూరమని రజిని పేర్కొన్నారు.
కేవలం అక్కడ అద్దాల కోసమే రూ.2,500 కోట్లు ఖర్చు చేసే బదులు, ఆ నిధులతో మెడికల్ కాలేజీలు పూర్తి చేయవచ్చని, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించవచ్చని ఆమె సూచించారు. ఆరోగ్యశ్రీకి రూ.4 వేల కోట్ల బకాయిలు పెట్టి సామాన్యుడి వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే అమరావతికి వ్యతిరేకం అంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని అన్నారు.