సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ నూతన డీజీపీ సీవీ ఆనంద్
- కొత్త డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన సీవీ ఆనంద్
- కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన డీజీపీ
- శాంతిభద్రతలను కాపాడటంలో రాజీ పడకుండా పనిచేస్తానని సీఎంకు హామీ
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎంను కలిశారు. తనపై నమ్మకం ఉంచి పూర్తిస్థాయి డీజీపీగా బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు, రాష్ట్రంలోని ప్రస్తుత భద్రతా పరిస్థితులపై చర్చించారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో, శాంతిభద్రతలను కాపాడటంలో రాజీ పడకుండా పనిచేస్తానని ఆయన సీఎంకు హామీ ఇచ్చారు.
మరోవైపు, ఈరోజు డీజీపీగా పదవీ విరమణ చేసిన శివధర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ భద్రతా సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. చీఫ్ సెక్రటరీకి సమాన హోదాలో ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ప్రతి నెల ఆయన రూ. 2.25 లక్షల వేతనం అందుకుంటారు. ప్రత్యేక కార్యాలయంతో పాటు ఎన్నో సదుపాయాలు ఆయనకు ఉంటాయి.