ఒక గంట నిద్రను కోల్పోతే.. కోలుకోవడానికి నాకు నాలుగు రోజులు పడుతుంది: త్రిష
- నిద్ర గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టిన త్రిష
- తాను ప్రశాంతంగా నిద్రపోవడానికి 2062 వరకు ఆగాలేమో అన్న త్రిష
- మానసిక అలసటను చమత్కారంగా పంచుకునన్న వైనం
దక్షిణాది చిత్రసీమలో చెక్కుచెదరని అందంతో, తిరుగులేని క్రేజ్తో దూసుకుపోతున్న త్రిష ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడూ గ్లామర్ ఫొటోలు, సినిమా అప్డేట్స్ ఇచ్చే త్రిష, ఈసారి తన వ్యక్తిగతమైన 'నిద్ర' గురించి చేసిన వింత లెక్క నెటిజన్లను అటు నవ్విస్తూనే, ఇటు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
"ఒక గంట నిద్రను కోల్పోతే, దాని నుండి కోలుకోవడానికి నాకు నాలుగు రోజులు పడుతుంది. ఈ లెక్కన నేను మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోవాలంటే 2062 వరకు ఆగాల్సిందేమో" అంటూ త్రిష చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. ఆమె సరదాగా అన్నప్పటికీ, ప్రస్తుతం ఆమె షూటింగ్ షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నాయో, ఆమె ఎంతటి పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో ఈ మాటలు ప్రతిబింబిస్తున్నాయి.
త్రిష ప్రస్తుతం తన కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో భారీ సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’తో పాటు, తమిళంలో సూర్యతో ‘కరుప్పు’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో ఆమె డైరీ ఫుల్ అయిపోయింది. వరుస ప్రయాణాలు, రాత్రింబవళ్లు షూటింగులతో తీరిక లేకుండా గడపడం వల్లే ఆమెకు సరైన విశ్రాంతి దొరకడం లేదని స్పష్టమవుతోంది.
సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లు, రాజకీయ అరంగేట్రంపై జరుగుతున్న ప్రచారం వంటివి కూడా ఆమెను కొంత ఒత్తిడికి గురిచేస్తుండవచ్చు. అందుకే తనకున్న మానసిక అలసటను ఇలా చమత్కారంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.