బెంగాల్‌‍లో పోలింగ్ బూత్‌లలో కమలం గుర్తు కనిపించకుండా టేప్ చుట్టారని బీజేపీ ఆరోపణ

  • వీడియోలు పోస్టు చేసిన బీజేపీ నేత అమిత్ మాలవీయా
  • ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా చేస్తున్నారని బీజేపీ ఆరోపణ
  • ట్యాంపరింగ్ నిజమని తేలితే తిరిగి పోలింగ్ నిర్వహిస్తామన్న ఎన్నికల సంఘం
పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్‌లో గల ఫల్తా నియోజకర్గంలోని పలు పోలింగ్ బూత్‌లలో కమలం గుర్తు కనిపించకుండా చేసి, ఓటు వేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని బీజేపీ పశ్చిమ బెంగాల్ కో-ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయా ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలను కూడా జత చేశారు. కమలం గుర్తు కనిపించకుండా, దానిపై టేపు వేశారని ఆరోపించారు.

ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా చేయడానికి తృణమూల్ నేతలు స్థానిక అధికారుల సహాయంతో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అమిత్ మాలవీయ ఆరోపించారు. ఈ ఘటనలు జరిగిన అన్ని బూత్‌లలో తక్షణమే రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. గతంలో డైమండ్ హార్బర్ లోక్ సభ స్థానం నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గెలవడానికి టీఎంసీ ఇదే వ్యూహాన్ని అనుసరించిందని ఆరోపించారు.

బీజేపీ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. పోలింగ్ బూత్‌లలో బటన్ల ట్యాంపరింగ్‌పై వచ్చిన నివేదికలను పరిశీలిస్తున్నామని పశ్చిమ బెంగాల్ ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. ఈ ఆరోపణలు నిజమని తేలితే ఆయా పోలింగ్ బూత్‌లలో తిరిగి పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.



Amit Malviya
West Bengal
Diamond Harbour
BJP
TMC
Polling Booth
Lotus Symbol
Re-polling

More Telugu News